#JusticeForChaithra చైత్ర కుటుంబానికి పరామర్శ.. అత్యంత దుర్మార్గం అంటూ పవన్ కల్యాణ్ భావోద్వేగం
హైదరాబాద్లో ఆరేళ్ల చిన్నారి ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య ఘటనను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఉహించిన ఘటనతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైత్ర కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే..

కిక్కిరిసిన జనాన్ని దాటుకొని పవన్ కల్యాణ్
చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు జనసేన నాయకులతో కలిసి సైదాబాద్లోని సింగరేణి కాలనీకి చేరుకొన్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పవన్ కల్యాణ్ చేరుకొని చైత్ర ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పటికే భారీగా జనం ఉండటంతో పవన్ కల్యాణ్కు అక్కడి వెళ్లడం కష్టంగా మారింది. తన వ్యక్తిగత సిబ్బంది, పోలీసు విభాగం సిబ్బంది సహకారంతో చైత్ర కుటుంబ సభ్యులను తన కారు వద్దకేపవన్ కల్యాణ్ పిలుపించుకొన్నారు. కారులోనే కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడారు. అనంతరం ప్రజలకు అభివాదం తెలిపారు.

పవన్ కల్యాణ్ ఎమోషనల్గా
పుట్టెడు దు:ఖంలో ఉన్న చైత్ర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పరామర్శకు వచ్చిన పవన్ కల్యాణ్ను చూడగానే భోరుమని విలపించారు. దాంతో అక్కడి పరిస్థితి గంభీరంగా మారిపోయింది. కుటుంబం పరిస్థితిని, అక్కడి వాతావరణాన్ని చూసి పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. సంఘటనకు సంబంధించిన వివరాలను పవన్ కల్యాణ్కు వివరించగా ఆయన ఎమోషనల్ అయ్యారు. కుటుంబానికి అండగా ఉంటానని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చెబుతానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మాటగా చెప్పినట్టు తెలిసింది.
సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే
చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఇంటి వారిపై సందేహం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు చెప్పినా సరే పట్టించుకోకపోవడం వల్లే నిందితుడు పరారీ అయ్యాడు అని పవన్ కల్యాణ్ అన్నారు. వెంటనే నిందితుడిని పట్టుకొనేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను పవన్ కల్యాణ్ కోరారు.

చిన్నారి హత్యా ఘటన కలిచివేసిందంటూ
చిన్నారి చైత్ర హత్యా ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. అందుకే వారిని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చాను. సభ్య సమాజం తలదించుకొనే రీతిలో, ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన బిడ్డను దారుణంగా హత్య చేయడం దుర్మార్గం. మీడియా కూడా కొన్ని ఘటనలను ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిని పట్టించకోకపోవడం సరికాదు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చిందని, దాంతో ఈ ఘటన తీవ్రత బయటకు తెలిసింది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి సూచన
చైత్ర హత్యా ఘటనను రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు ఖండించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాలి. చిన్నారి కుటుంబానికి మనోస్థైర్యం కలిగించాలని, వారికి న్యాయం చేయాలి అని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.


Click it and Unblock the Notifications











