కంటతడి పెట్టిన కృష్ణ, నరేష్... ఓదార్చిన పవర్ స్టార్.. విజయ నిర్మలకు పవన్ కల్యాణ్ శ్రద్దాంజలి
Recommended Video
దర్శకురాలు, నటి, నిర్మాత విజయ నిర్మల ఆకస్మిక మృతి పట్ల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ సినీ ప్రముఖురాలు విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో జూన్ 27 తేది తెల్లవారు జామున మరణించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ తన భావోద్వేగ సంతాప ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..

విజయ నిర్మల నివాసానికి వెళ్లి
దిగ్గజ దర్శకురాలు విజయ నిర్మల భౌతిక కాయానికి జనసేన అధినేత పవన్ కల్యాన్ భావోద్వేగ పూరితంగా శ్రద్దాంజలి ఘటించారు. పుష్ఫగుచ్ఛం ఉంచి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి లోనైన పవన్ కల్యాణ్ పార్టీ తరుఫన సంతాప ప్రకటనను విడుదల చేశారు. అనంతరం విజయ నిర్మల నివాసానికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పార్టీ సంతాప ప్రకటనలో
ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని తన సంతాప ప్రకటనలో తెలిపారు.

సూపర్ స్టార్ కృష్ణ, నరేష్కు ఓదార్పు
సతీ వియోగంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణను స్వయంగా ఓదార్చారు. ఆయనలో మనోధైర్యాన్ని నింపేందుకు, స్వాంతన చేకూర్చేందుకు పవన్ బాధను పంచుకొన్నారు. కృష్ణతో చాలా సేపు మాట్లాడి సంతాపం తెలిపారు. నైతికంగా మద్దతు తెలిపారు. విజయ నిర్మల కుమారుడు నరేష్ను కలిసి ఓదార్చారు. ఆమె మరణానికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకొన్నారు.

శుక్రవారం అంత్యక్రియలు
ఇదిలా ఉండగా, నానక్ రామ్ గూడలోని తన నివాసంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్తం పెట్టిన విజయ నిర్మల భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఆమె అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











