పవన్ కటౌట్ ని ఇలా వాడేస్తున్నారు(ఫొటోలు)
హైదరాబాద్ :గబ్బర్ సింగ్ సినిమాలోని కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే డైలాగు చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అందులో గబ్బర్ సింగ్ కటౌట్ ని రిక్షాలో పట్టుకుని బ్రహ్మానందం పెట్టుకుని తిరుగుతాడు. ఇప్పుడు అలాంటి సీనే ఎన్నికల ప్రచారంలో కనపడుతోంది. మీరు చూస్తున్న ఫొటోలు...తెలుగుదేశానికి పవన్ మద్దుతు ఇస్తున్నాడనే విషయం చెప్పటానికి,ప్రచారంలో ఆయన్ని కటౌట్ రూపంలో ఉపయోగించుకుంటున్నారు. పవన్ అన్ని చోట్లకు వెళ్లలేడు కాబట్టి ఈ కటౌట్ ప్రచారం అంటున్నారు.
మరో ప్రక్క పవన్ ప్రచారంతో తెలంగాణా హోరెత్తింది. ఆయన ప్రసంగిస్తూ.. ''తెలంగాణ యువత తరఫున బలమైన గొంతుక కావాలి. అందుకే జనసేన పార్టీ పెట్టా. తాను పార్టీ పెట్టింది సామాజిక తెలంగాణ కోసమే తప్ప దొరల తెలంగాణ కోసం కాదు'' అని పవన్ వివరించారు. ప్రభుత్వాలు బాధ్యత మరిస్తే.. బలం పుంజుకుని తప్పక పోటీలో నిలబడతామన్నారు. అప్పటి వరకు తెలంగాణలోని హైదరాబాద్లోనే ఉంటానన్నారు. మనం ఇక్కడ ఒకరిని ఒకరం కొట్టుకుంటుంటే .. శత్రుదేశాలు మన నల్గొండ నడిబొడ్డు వరకు దూసుకొస్తాయని హెచ్చరించారు. ఒకే మంత్రం అభివృద్ధి .. ఒకే పేరు నరేంద్రమోడీ.. ఒకే నినాదం కాంగ్రెస్ హఠావో అంటూ పవన్ అన్నారు.

అలాగే ...పల్లే కన్నీరు పెడుతుందో! అన్న పద్యం గుర్తుందా? అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ను ప్రశ్నించారు. ''హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ లేదు.. ముందుగా పల్లెపల్లెను అభివృద్ధి చేసి మాట్లాడు'' అని సూచించారు. సోమవారం పవన్కల్యాణ్ కరీంనగర్ జిల్లా కోరుట్లలో, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో, నల్గొండ పట్టణంలో భాజపా, తెదేపా ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.
''బాబాయ్ కేసీఆర్, చెల్లెమ్మ కవిత.. మీరు నన్ను తిట్టే తిట్లు బంగారు తెలంగాణ సాధించే దిశగా ఉండాలి. అంతే తప్ప మీకు, నాకు మధ్య ద్వేష భావం పెంచేలా ఉండకూడదు'' అని వ్యాఖ్యానించారు. అందరినీ తిడితే బంగారు తెలంగాణ ఏవిధంగా సాధ్యమవుతుందని నిలదీశారు. హరీశ్రావుకు, బొత్స సత్యనారాయణతో వ్యాపార సంబంధాలకు సంబంధించి రుజువులు ఉన్నాయని తెలిపారు.

''సాక్ష్యాధారాలు చూపే ముందు నేనొకటి అడుగుతున్నా.. నీవు సూర్య భగవానుడికి మొక్కేందుకు విజయవాడ, ఉత్తరాంధ్రకు, ప్రత్యేకించి బొత్స నియోజకవర్గానికే ఎందుకు వెళ్తున్నావు? తెలంగాణలో సూర్య భగవానుడు ఉదయించడం లేదా?'' అని హరీశ్రావును ప్రశ్నించారు. బొత్సతో వ్యాపారాలు అభివృద్ధి చేసేందుకు జత కట్టిన హరీశ్రావు తెలంగాణకు ఏం న్యాయం చేస్తారో అర్థం చేసుకోవాలన్నారు. ''పవన్ కల్యాణ్ను చిటికన వేలంత వాడని బాబాయ్ కేసీఆర్ అంటున్నారు. నేను చిటికన వేలంతవాడినే కావచ్చు. కానీ.. గొంతెత్తితే ఓ దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాలో ఉంది'' అని ఆవేశంగా అన్నారు.


Click it and Unblock the Notifications











