Pawan Kalyan నాయకులనే కాదు.. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు.. భావోద్వేగంగా పవన్ కల్యాణ్ ప్రసంగం
హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..

నా దేశం... నా జాతి కోసమే
నేను ఎంత వరకూ విజయం సాధించానో నాకు తెలియదు. కానీ సినిమాల్లో నటించడం నేను జీవించేందుకు.. కానీ రాజకీయాలు మాత్రం నా దేశానికి... నా జాతి కోసమే. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని. విజయం కోసం ఎదురు చూసే వ్యక్తులు తప్పనిసరిగా కామ, క్రోధ, మదమాత్సర్యాలను అధిగమించాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

అపజయం తర్వాత నిరుత్సాహపడలేదు
సినిమా ఎప్పుడూ నేను కోరుకొంది కాదు. నా ఆలోచనలు, ఆశయాలు వేరే రీతిన ఉంటాయి. సీఏ విధ్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ జీవితంలో విజయాలు సాధించాలి. మీ వ్యక్తిగత విజయాలు జాతికి సంపదగా భావించండి. నా మొదటి సినియా అపజయం తర్వాత నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. కానీ నా విజయాల గ్రాఫ్ ఏడవ సినిమా తర్వాతే పెరిగింది అని పవన్ కల్యాణ్ చెప్పారు.

మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు
ఛార్టెడ్ అకౌంటెంట్ అంటే ఫర్ఫెక్షన్కు చిరునామా. మీరు కాకపోతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లంటే.. తక్కువ అంచనా వేస్తారు. మిమ్మల్ని అలా తక్కువ అంచనా వేసే వారిని మీరు తప్పు అని నిరూపించాలి. తెల్లజుట్టు వచ్చినంత మాత్రాన నాలెడ్జ్ ఉందని అనుకోవద్దు. 10 సంవత్సరాలలోపు పిల్లలు జీనియస్ ఉంటారు. అలాంటి పిల్లల ప్రతిభను మన విద్యా వ్యవస్థ ద్వారా చంపేస్తున్నారు. కాబట్టి మీరు మీ హక్కులను తెలుసుకొండి. వాటి గురించి పోరాటం చేయండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ఏది మంచి.. ఏది చెడు
ఎంత గొప్పవాడైనా సరే.. ఎంత గొప్ప నాయకుడైనా సరే.. బాగా అంచనా వేయండి. ఒకవేళ వాళ్లు మీ రోల్ మోడల్ కాకపోతే.. వారికి మీరే రోల్ మోడల్ అవ్వండి. ఎవరో సక్సెస్ అయ్యారని, పేరు ప్రఖ్యాతులు ఉన్నంత గొప్ప వాళ్లు కాదు. పేరు, డబ్బు ఉన్న వాళ్లు గొప్ప వాళ్లు కాదు. మీకు సరిగా ఆలోచించే టాలెంట్ ఉంది. ఏది మంచి.. ఏది చెడు అని తేల్చే విచక్షణ మీకు ఉంది. కాబట్టి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. చివరికి దేవుడినైనా గుడ్డిగా నమ్మకండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

మీరు కాకపోతే మరెవరు అంటూ
ప్రతీ ఒక్కరి విజయంతోనే దేశ పురోగాభివృద్ది ఉంటుంది. రేపు మీరు దేశాన్ని సాధించే ఆర్థికవేత్తలు, నిపుణులు అవుతారు. వాల్ స్ట్రీట్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తారు. మీరు దేశ అభివృద్ధికి దోహదపడుతారు. కాబట్టి మీ సక్సెస్ భారత్ను పటిష్టం చేస్తుంది. భారత్ను ప్రగతిపథంలోకి తీసుకెళ్లే బాధ్యత మీపైనే ఉంది. మీరు కాకపోతే ఎవరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ విషయాన్ని మీరే ఆలోచించుకోండి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











