కమల్ హాసన్ టైపులో పవన్కు పూలమాల వేసిన ఫ్యాన్.. ఇదెక్కడి స్వాగతం బ్రో (వీడియో)
పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలతోపాటు మరోవైపు రాజకీయాల్లోనూ జోరు చూపిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా వారిని అభిమానులు అనేకంటే పవన్ భక్తులు అనడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా అభిమానులందు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా అనేటట్లుగా వాళ్లు ప్రవర్తిస్తుంటారు. అందుకు సినిమా ఫంక్షన్స్, థియేటర్ల వద్ద గోల వంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ, వీటన్నింటికి మించి ఓ వ్యక్తి పవన్ పై తన అభిమానం చాటుకున్న తీరు అవాక్కయ్యేలా చేస్తుంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నాయుకుడు కొట్టే సాయిపై సీఐ అంజూ యాదవ్ ఇటీవల చేయి చేసుకున్న వీడియో తెగ వైరల్ అయింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించిన జనసైనికులను పోలీసులు అడ్డుకునే క్రమంలో కొట్టే సాయి రెండు చెంపలపై సీఐ కొట్టారు. ఈ చర్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేనాని పవన్ ఇవాళ తిరుపతికి వెళ్లారు.

జూలై 17న ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లారు. ఈ క్రమంలో జనసేనానికి అబిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సమయంలోనే ఓ అభిమాని వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. దశావతారం సినిమాలో కమల్ హాసన్ టైపులో కొక్కాలకు వేలాడదీసినట్లుగా క్రేన్ సాయంతో వెళ్లి పవన్ కల్యాణ్ మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి ఎవరూ ఊహించని విధంగా స్వాగతం పలికి అభిమానం చాటుకున్నాడు.
తన అభిమాని వెరైటీ స్వాగతానికి పవన్ కల్యాణ్ ఫిదా అయిపోయారు. అక్కడున్న వాళ్లంతా నవ్వుతూ, అరుస్తూ అభిమానిని ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. అశేష అభిమానుల నుంచి పవన్ కాన్వాయ్ వరకు చేరుకుంటానో లేదో అన్న అనుమానంతోనో, లేదా ఏదైనా స్పెషాలిటీ ఉండాలనో ఆ అభిమాని ఇలా క్రేన్ సాయంతో వేలాడుతూ వెల్ కమ్ చెప్పినట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ అభిమాని చేసిన పనికి కొంతమంది మెచ్చుకుంటే.. మరికొంత మంది అలా ఎలా వేలాడుతూ ఉన్నావ్ బ్రో అంటూ అభిప్రాయం తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











