HBD Pawan Kalyan: థియేటర్లలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బీభత్సం.. జరిగిన నష్టం ఎంతంటే?
పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్ సౌండ్ మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్ అయినా సరే.. పవన్ కల్యాణ్ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యాడు పవన్ కల్యాణ్. తర్వాత తనదైన నటన, మ్యానరిజంతో అశేష అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్గా ఎదిగాడు పవన్ కల్యాణ్. ఇవాళ అంటే సెప్టెంబర్ 2న ఈ పవర్ స్టార్ పుట్టినరోజు. ఇక ఆయన బర్త్డేకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే కొన్నిసార్లు అది పరిధి దాటుతుంటుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటనలు.

తగ్గని క్రేజ్..
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆద్యంత తనదైన స్టైల్తో, డ్యాన్స్లతో, డైలాగ్లతో, మ్యానరిజంతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్నాడు. అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్న స్టార్గా పవన్ కల్యాణ్ నిలిచాడు. సినిమా హిట్ అయన, ఫ్లాప్ అయినా పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

27 సినిమాలు..
పవన్ కల్యాణ్ చివరిగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా వరకు ఇప్పటికి 27 సినిమాలు చేశాడు పవన్ కల్యాణ్. అందులో విజయాలకంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయినా పవన్ కల్యాణ్ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. హిట్టు, ఫ్లాప్లకు సంబంధం లేకుండా సినిమా సినిమాకు ఆయన మార్కెట్ పెరుగుతూనే వచ్చింది. ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న పవన్ కల్యాణ్ బర్త్డే ఇవాళ.

ఫ్యాన్స్ హంగామా..
ఆయన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు అక్కడక్కడ ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయన సూపర్ హిట్ మూవీ జల్సా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన ఫ్యాన్స్ కొందరు బీభత్సం సృష్టించారు. వైజాగ్లోని లీలా మహాల్ థియేటర్లో జల్సా మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ షోను ప్రదర్శించారు. అయితే ఈ థియేటర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నానా హంగామా చేసినట్లు సమాచారం.

థియేటర్ ధ్వంసం..
బీర్ బాటిల్స్ పగలకొట్టి స్క్రీన్ చించేశారు. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్ సైతం డ్యామేజ్ చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్ పరిస్థితి అద్వాన్నంగా తయారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్ యాజామాన్యం గగ్గోలు పెడుతోంది. సుమారు రూ. 20 లక్షల నష్టం వచ్చినట్లు సమాచారం. ఇదేకాకుండా మరో చోట ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

సౌండ్ సిస్టం సరిగా లేదని..
కర్నూల్లోని శ్రీరామ థియేటర్లో జల్సా సినిమా చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున వచ్చారు. అయితే థియేటర్లో సౌండ్ సిస్టం సరిగా లేదని ఫ్యాన్స్ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. సహనం కోల్పోయిన పవన్ ఫ్యాన్స్ థియేటర్పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చేరుకుని పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











