గెలుపు కోసం....పవన్ అభిమానుల పూజలు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా మొదలు కానేలేదు....అప్పుడే పార్టీ గెలుపుకోసం పూజలు ప్రారంభించారు అభిమానులు. పవన్ కళ్యాణ్ స్థాపించబోయే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ అరసవెల్లి సత్యనారాయణ మూర్తి దేవాలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ ర్యాలీగా అరసవెల్లి చేరుకున్నారు. అనంరతం పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన సభలో తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.

ఇంతవరకు దేశంలో ఏర్పాటైన పార్టీలన్నింటికంటే ఇది విభిన్నం. పవన్ రాజకీయ పార్టీ అయినా లక్ష్యం రాజ్యాధికారం కాదు.. ప్రజల్ని చైతన్యపర్చడమే ఈ పార్టీ ముఖ్యోద్దేశ్యం. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ పార్టీ ఆశయంకాదు. చట్టసభల్లో కూర్చుని ప్రజల సంపదకు కాపలా కాయడం, ప్రభుత్వం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించడం.. దానివల్ల సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఒనగూరే నష్టాలపై ప్రజలకు వివరించడం. అందుకే ఇది కచ్చితంగా చరిత్ర సృష్టించే పార్టీ అవుతుందని అంటున్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలపై పవన్కు నమ్మకం సడలింది. నిరాశనిస్పృహల్లో ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయాల్ని చూపాలని ఆకాంక్షించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ ఆమోదయోగ్యులు కాకుంటే ప్రత్యామ్నాయం చూపించాలనే న్యాయవ్యవస్థ అభ్యర్థులందర్నీ తిరస్కరించే అవకాశం ఓటర్లకు కల్పించాలంటూ ఎన్నికల కమిషన్ను సుప్రీం ఆదేశించింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటాను ప్రవేశపెట్టింది. అయితే దీనివల్ల అభ్యర్థులు వ్యతిరేకించే అవకాశం ఓటర్లకు కలగడంలేదు. వ్యక్తిగతంగా అసమర్థుడు, అవినీతిపరుడు, నేరచరిత్రున్న అభ్యర్థులను వ్యతిరేకించే అవకాశం ఈ విధానంలో లేదు. అభ్యర్థులందర్నీ తిరస్కరించడం కూడా ఎన్నికల బహిష్కరణ కిందే వస్తుంది.దీంతో అభ్యర్థులు, వారిని బరిలో దింపే పార్టీల్లో ఎలాంటి మార్పురాదు. అదే వ్యతిరేక ఓటు అమల్లో ఉంటే అభ్యర్థులఎంపికలో పార్టీలన్నీ అప్రమత్తంగా ఉంటాయని పవన్ ఆలోచించారు. ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని చూపాలని భావించారు. ఈ ఆలోచనల నుంచే కొత్తపార్టీ పుడుతోంది.


Click it and Unblock the Notifications











