‘నాయక్’ ఆడియోకు దూరంగా పవన్ కళ్యాణ్
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'నాయక్' చిత్రం ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన చాలా దూరంలో ఉంటున్నారు కాబట్టి. ఏంటి? కన్ ఫ్యూజ్ అవుతున్నారా?. అసలు మ్యాటర్లోకి వెళితే.... ఈ నెల 17న జరుగనున్న 'నాయక్' ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మెగా ఫ్యామిలీలో హీరోలంతా హాజరవుతున్నారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు వస్తున్నారని ప్రచారం జరిగింది.
తాజాగా అందని సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుకకు రావడం లేదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఆయన తన సినిమాకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి స్పెయిన్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ పలు లొకేషన్లు సెలక్ట్ చేయడంతో పాటు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడం లేదనే విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్లో ఉన్న పలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పేజీల్లో కూడా స్పష్టం చేసారు.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ఆడియో కంపోజింగ్ తో పాటు పాటల రీ రికార్డింగ్ కూడా పూర్తి చేసాడు. కొన్ని ప్రోమో సాంగులు కూడా విడుదల చేసారు. ఈ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ అందించానని చెబుతున్న తమన్... ఆడియో విడుదల కార్యక్రమం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్ చేశారు. అదే విధంగా మెగాస్టార్ తన సినిమాల్లో వేసిన స్టెప్టులను ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టి మెగా అభిమానులను అలరించనున్నాడు రామ్ చరణ్.
యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











