తెలంగాణ, సీమల్లో పవన్ సభలు..డిటేల్స్
హైదరాబాద్: తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో నిర్వహించిన తర్వాత... వివిధ అంశాల వారీగా జనంలోకి వెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ నిర్ణయించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు... ఇలా ఆయా వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రతీ వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
విశాఖ సభ అనంతరం రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లోనూ ఇలాంటి సభలే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈనెల 27న విశాఖపట్నంలో నిర్వహించే సభకు అభిమానులతోపాటు విద్యార్థులు, యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు పవన్ సన్నిహితులు తెలిపారు.

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సభలో పాల్గొంటామని సమాచారం పంపుతున్నట్లు చెప్పారు. ఈసారి పాసులతో పనిలేకుండా, అందర్నీ సభకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు 'యూత్ ఆఫ్ ది నేషన్-ఫైట్ ఫర్ ది నేషన్' అని సభకు ట్యాగ్లైన్ పెట్టారు. ఇందు కోసమే రూపొందించిన ప్రత్యేక లోగో, గీతాన్ని సోమ, మంగళవారాల్లో ఆవిష్కరించనున్నారు.
తన స్నేహితుడు రాజు రవితేజతో కలిసి పవన్ రచించిన 'ఇజం' పుస్తకాన్ని విశాఖ సభలో ఆవిష్కరిస్తారు. కాగా, సోమవారం వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులు నిర్ణయించారు. సభలో ఆవిష్కరించేందుకు భారీ జాతీయ పతాకాన్ని ఓ అభిమాని రూపొందిస్తున్నారు. పీవీపీ సంస్థ ప్రతినిధులు ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











