ఆ స్థలం సరిపోవడం లేదు, మరింత ఇవ్వండి: సినీ కార్మికుల తరుపున పవన్ కళ్యాణ్
హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల సమస్యలపై నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో సమావేశమై సమస్య అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశ్రమ వల్ల లక్షలాది మందికి ఉపాధి పొందుతున్నారని, ఇలాంటి పరిశ్రమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు.

సినీ కార్మికులకు మరింత స్థలం కేటాయించాలి
మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్రపరిశ్రమ తరలించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 4వేల మంది కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం 67.16 ఎకరాలు కేటాయించారని, ఇప్పుడు పరిశ్రమ చాలా పెద్దదయింది, దాదాపు 35వేల మంది కార్మికులు పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు, ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోనందున మరికొంత స్థలం కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న మనిషి, న్యాయం జరుగుతుంది
తెలుగు సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవారు కావడంతో ఆయన ఆధ్వర్యంలో అందరికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఆ స్థలాన్ని అందరికీ సర్దలేక పోతున్నాం
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... 4వేల మందికి సరిపోయే స్థలాన్ని 40 వేల మందికి సర్దడం కష్టంగా ఉందని తెలిపారు. అందుకే ఇప్పుడున్న స్థలం పక్కనే ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల స్థలం కూడా సినీ కార్మికుల కోసం కేటాయించాలని కోరాం, ప్రభుత్వ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ తరఫున పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే వేలాది మంది పేద కార్మికులకు మేలు జరుగుతుందన్నారు.

పవన్ కళ్యాణ్ మీటింగులో...
పవన్ కళ్యాణ్తో సమావేశం అయిన వారిలో జనసేనపార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ వినోద్ బాల, కార్యవర్గ సభ్యులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహానందరెడ్డి, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











