పవన్ పార్టీ లోగో డిజైన్ చేసిందెవరు?
హైదరాబాద్: పవన్కల్యాణ్ రాజకీయ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ముహూర్తం శుక్రవారం రాత్రి. 'జనసేన' పేరుతో తను ప్రారంభించే పార్టీ సిద్ధాంతాలనీ, తన రాజకీయ ఆలోచనల్నీ ఈ రోజు అభిమానుల సమక్షంలో వెల్లడించబోతున్నారు. ఎందుకోసం పార్టీని నెలకొల్పుతున్నదీ స్పష్టం చేయబోతున్నారు. నగరానికి చెందిన రాజేష్ అనే చిత్రకారుడితో పార్టీ లోగోను తయారు చేయించినట్లు తెలిసింది.
జెండా రంగు తెల్లగా ఉంటుంది. జెండా మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం, దాని మధ్యన నక్షత్రం ఉంటాయి. వీటిచుట్టూ నల్లటి రంగుతో గీత, నక్షత్రం మధ్యలో ఎర్రటి చుక్క ఉన్నదే ఆయన పార్టీ లోగో. ఎరుపు రంగు విప్లవానికీ, మార్పునకు ప్రతీకలుగా చెబుతున్నారు. తెలుపు నేపథ్యం శాంతికీ, వేల సంవత్సరాల భారతీయ నాగరికత, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నక్షత్రం తమ పార్టీ ఎంచుకొన్న ఆరు ఆదర్శాల్నీ వెల్లడిస్తుందంటున్నారు. మధ్యలో ఉన్న చుక్క పార్టీ ఆత్మకు ప్రతీక అని పేర్కొంటున్నారు. జనసేన పార్టీ కోసం రెహమాన్ అనే సినీ గీత రచయిత ఓ పాటను రాశారు. 'తూరుపు దిక్కు ఎరుపెక్కి...' అంటూ సాగే ఈ గీతానికి శ్రీనివాస్ స్వరాలు అందించగా, నరేందర్ గానం చేశారు. రెహమాన్ గతంలో పవన్ నటించిన తీన్మార్ చిత్రంలో 'గెలుపు తలుపు తెరిస్తే' అనే పాట రాశారు. అయితే ఈ గీతాన్ని పార్టీ కోసం సదస్సు ఏర్పాట్లు చూసుకొంటున్నవాళ్లే రాయించారని తెలిసింది.

పార్టీ ఆవిర్భావ సమావేశానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) ఆవరణలోని నోవాటెల్ హోటల్ను వేదికగా ఎంచుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ ప్రసంగం చూసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి ఎంపిక చేసిన ఆరువేల మంది అభిమానులను ఆహ్వానించినట్లు తెలిసింది. వీరందరికీ ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. రాజకీయ నాయకులకీ, సినీ ప్రముఖులకీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని సమాచారం. ఇప్పటికే నోవాటెల్ ప్రాంగణంలో పవన్ పార్టీ వర్గాలు ఏర్పాట్లను చురుగ్గా సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











