హైదరాబాదే అడ్డా.. బాధితులకు గొంతుకను అవుతా.. పవన్ కల్యాణ్
సినీ కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చే చిత్రపురి కాలనీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు. చిత్రపురి కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్'లోని జనసేన కార్యాలయంలో కలిసిన జూనియర్ ఆర్టిస్టులు, క్యాస్టూమర్లు, ఫైటర్లతో పవన్ కల్యాణ్ పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా వారి సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే...

ఇళ్లు దక్కకుండా వేదనతో
చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కకుండా వేదనకు లోనవుతున్న వారికి భరోసాగా ఉంటాను. బాధితుల తరఫున గొంతుకను అవుతాను. చిత్రపురి కాలనీ సమస్యలపై ఎన్ శంకర్, పరుచూరి వెంకటేశ్వర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజాతో చర్చిస్తాను అని బాధితులతో పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను జనసేన అధినేత దృష్టికి తీసుకొచ్చారు.

సినీ కార్మికుల వేదన
సినీ రంగంలో 24 విభాగాలకు చెందిన తమకు ఇళ్లు దక్కడం లేదు. చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వాళ్లకి ఫ్లాట్స్ దక్కుతున్నాయి. ఈ విషయంలో పశ్నిస్తే పని లేకుండా చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు అని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పలుమార్లు దృష్టికి తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.

టాలీవుడ్కు హైదరాబాద్ అడ్డా
హిందీ చిత్ర సీమకు ముంబై సెంటర్గా ఉన్నట్టు.. తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. తెలుగు భాషకు సంబంధించిన ఏ భాషలో తీసినా హైదరాబాద్ కేంద్రంగా సినీ పరిశ్రమ పనిచేస్తుంది. కాబట్టి చిత్రపురిలో తెలుగు సినిమా రంగంలోని కార్మికులు, సాంకేతిక నిపుణుల పిల్లలకు కూడా ఇళ్లు ఇవ్వాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

చిత్ర పరిశ్రమ ప్రముఖులతో
సినీ కార్మికులకు సంబంధించి చిత్రపురిలో ఇళ్ల సమస్యలకు పరిష్కారం చూపుతాను. ఆ విషయంలో అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. దీనిపై చిత్ర పరిశ్రమలోని వారితో మాట్లాడుతాను. పార్టీపరంగా నేతలు శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవన్ హామీ ఇవ్వడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











