చర్చనీయంశంగా పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ .. నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరంటూ కామెంట్.. వారిని ఉద్దేశించా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ప్రపంచం అంతా బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ సినిమా అనగానే అధికారులు అందరూ అలెర్ట్ అయ్యారు. అసలు ఏపీలో టికెట్ ధరలు ఇంకా పెంచలేదని నోటీసులు పంపారు. ఏపీలో టికెట్ రేట్లు పెంచి అమ్మినా, బెనిఫిట్ షోవేసినా ఊరుకునేది లేదని చెబుతూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆశ్చర్యకరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఫిబ్రవరి 25న
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ కే చంద్ర తెరకెక్కించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్గా ఈ సినిమా రూపొందింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది. అనేక సార్లు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న మన ముందుకు వస్తోంది.

అన్ని థియేటర్లకు నోటీసులు
సినిమా విడుదలకు ఇంకా గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే హంగామా మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మేనియా కనిపిస్తోండగా తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో భీమ్లా నాయక్ సందడి నెలకొంది. అయితే ప్రపంచం అంతా ఒకలా ఉంటే ఏపీలో మాత్రం నియమాలను కఠినతరం చేస్తూ అన్ని థియేటర్లకు నోటీసులు పంపించారు.
ట్వీట్లో
భీమ్లా నాయక్ సినిమాకు అదనపు ఆటలకు కానీ, టిక్కెట్ ధరల పెంపునకు కానీ అనుమతులు లేవని... జీవో నం.35 ప్రకారం రేట్లు అమలు చేయకపోతే థియేటర్లను సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో విడుదలకు కొన్ని గంటలకు ముందు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు
'మొదట వారు సోషలిస్టులు కోసం వచ్చారు. అప్పుడు నేను సోషలిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నాకోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.' అని మార్టిన్ నిమొల్లర్ మాటలను, ఫోటోను ఆ ట్వీట్లో పేర్కొన్నారు.

హెచ్చరిస్తున్న విధంగా
అలా ఒకరకంగా ఆయన తన సినిమాకు తలెత్తిన సమస్య తర్వాత మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న విధంగా కనిపిస్తోంది. అయితే ఒక రకంగా సాయి ధరం తేజ్ 'రిపబ్లిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కల్యాణ్ ఇవే మాటలు చెప్పుకొచ్చారు. ఆ మాటలనే ఇప్పుడు మరోసారి ప్రస్తావించారు. ఇప్పుడు ఇది సినిమా పరిశ్రమను, ప్రభుత్వాన్ని ఉద్దేశించే అనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











