పవన్ పార్టీ ఖర్చు అంతా!?
హైదరాబాద్: పవన్ కల్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ ప్రారంభోత్సవ ఖర్చుపై విచారణ జరపాలని న్యా యవాది బద్దం నర్సింహారెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారని, వివిధ చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయని అందులో పేర్కొన్నారు.
వేలమంది అభిమానుల సమక్షంలో నోవాటెల్ హోటల్లో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారని, దీనికి సుమారు రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. కాగా, జనసేన పార్టీపై నర్సింహారెడ్డి చేసిన ఫిర్యాదును ఆదాయపన్ను శాఖకు పంపనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ పూర్తికాలేదని, ఆ పార్టీ పోటీ చేస్తుం దో లేదో తెలియదని, అటువంటప్పుడు దీనిపై తాము చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని తెలిపాయి.
పవన్ కల్యాణ్ తన కొత్త రాజకీయ పార్టీ పేరును 'జన సేన'గా అధికారికంగా ప్రకటించారు. పలు అంశాలపై తన హృదయాన్ని ఆవిష్కరించారు. 'కాంగ్రెస్ కో హఠావ్...దేశ్ కో బచావ్' అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై విరుచుకుపడ్డ పవన్... కాంగ్రెస్పై, ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలపై నిప్పులు చెరిగారు. అయిదేళ్ల పాటు ఏం చేయకుండా... ఆఖర్లో 23 నిమిషాల్లోనే ప్రత్యక్ష ప్రసారాలను ఆపి మరీ లోక్సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని, ఏ ప్రాంతానికి సంతృప్తి కలిగించలేదని విమర్శించారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 2009 లోనే సోనియాగాంధీ, రాహుల్గాంధీలు రాష్ట్ర ప్రజలను అందుకు సిద్ధం చేసివుంటే తెలంగాణలో ఇంత మంది తల్లులకు గుండెకోత ఉండేది కాదన్నారు.

తెలంగాణకూ న్యాయం చేయలేదని, హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారని, ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను లేకుండా చేశారని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేసిన పీవీ నర్సింహరావు చనిపోతే... ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం లోపలికి రానివ్వలేదని, హైదరాబాద్కు పంపేస్తే ఇక్కడా కాలీ కాలకుండా సంస్కారం చేశారని చెప్పారు. పీవీ అంటే అధిష్ఠానానికి అంత కోపమన్నారు. ప్రతీ తెలుగువాడూ పీవీ నరసింహారావులా అధిష్ఠానానికి కనిపించాడో ఏమో రాష్ట్రంపై ఇంతటి కోపం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక పవిత్ర నాయకత్వం ఉంటుందని ఎద్దేవా చేసిన పవన్ కల్యాణ్... కేంద్ర మంత్రులు జైరాం రమేష్, సుశీల్కుమార్ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, అధిష్ఠానం పెద్దలు అహ్మద్ పటేల్, దిగ్విజయ్సింగ్లను పేరుపేరున ప్రస్తావిస్తూ విమర్శించారు. 'తెలుగు ప్రజలను మోసం చేశారు. గాయపడ్డాం. మా హృదయాలు రక్తమోడుతున్నాయి. మిమ్మల్ని నమ్మాం. వెన్నుపోటు పొడిచారు. జనం తరఫున, జనసేన తరఫున ఒకటే పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ కో హటావ్...దేశ్ కో బచావ్' అని ఉద్ఘాటించారు. సభకు హాజరైన వారితో 'కాంగ్రెస్ కో హటావ్...దేశ్ కో బచావ్' అని రెండుసార్లు చెప్పించారు. కాంగ్రెస్ ఒక్క స్థానమూ గెలవదన్నారు.
అది గెలవకుండా చేసేందుకు తాను పోరాడతానని ప్రకటించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే వూరుకోబోనని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సోనియాతో సహా ఎవర్నీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జాతి సమగ్రతను చెడగొట్టే వీరిని అంగీకరించ బోనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా? చేయనా? అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. పార్టీ నిర్మాణం చేస్తానని...జంపింగ్స్ నేతలను, జోకర్స్ను తీసుకోబోనని స్పష్టం చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











