దొడ్డిదారిన కాదు.. మా అన్నని రాజమార్గంలో తీసుకొస్తున్నా.. పవన్ కళ్యాణ్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తన సోదరుడు నాగబాబుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఖరారైన సంగతి తెలిసిందే. మరో 21 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా పవన్ తన సోదరుడిని పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

నేనే స్వయంగా
నాగబాబుని జనసేన పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పవన్ ప్రసంగించారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా నాగబాబు గారు తనదైన జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుత పరిస్థితుల్లో తానే స్వయంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించానని పవన్ అన్నారు. ఒకరకంగా తనలో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి నాగబాబు గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

దొడ్డి దారిన కాదు
తాను తన సోదరుడిని దొడ్డి దారిన కాకుండా.. రాజమార్గంలో పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆయన్ని ప్రజా క్షేత్రంలో నిలబెడుతూ నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దింపుతున్నట్లు పవన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాగబాబు ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు తొలిసారి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.

టెన్షన్ పడ్డా
నాగబాబు మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పగానే మొదట టెన్షన్ పడ్డానని తెలిపారు. పవన్ నా తమ్ముడు అయినప్పటికీ నా నాయకుడు కూడా అని అన్నారు. పవన్ ని చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. అలాంటిది ప్రస్తుతం గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న లీడర్ గా ఎదిగాడని ప్రశంసించారు.

తొలిసారి ఎన్నికల బరిలో
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికలల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు జనసేన పార్టీకి చాలా కీలకం కానున్నాయి. పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని గాజువాక, వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించడం కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











