Bheemla Nayak: శుక్రవారం వచ్చి సంతకం పెట్టరా నాకొడకా.. పవన్ పంచ్లు ఆయనకేనా!
తెలుగు సినీ ఇండస్ట్రీకి కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు మూతపడడం, షూటింగ్లు ఆగిపోవడంతో చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు ఎదురయ్యాయి. ఇక, దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లను తగ్గిస్తూ తెచ్చిన జీవో వల్ల మరిన్ని కష్టాలు ఉత్పన్నం అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ మధ్య గంభీర స్వరంతో గర్జించాడు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వానికి.. పవర్ స్టార్కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీలో పవన్.. సీఎంపై సెటైర్లు వేశాడంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్గా భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్లను అందించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించారు.

పవన్ క్రేజ్... బిజినెస్, విడుదల
ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకున్న 'భీమ్లా నాయక్' మూవీకి అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ గ్రాండ్గా విడుదలైంది. మొత్తంగా దీన్ని 2000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు.

పాజిటివ్ రివ్యూలు.. ఫుల్ మీల్స్
మాస్ రివేంజ్ డ్రామాగా 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో స్పెషల్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. మొత్తంగా ఫ్యాన్స్కు ఇది ఫుల్ మీల్స్ అయింది.

భీమ్లా నాయక్కు ప్రభుత్వం షాక్
పవన్ - రానా కాంబోలో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్కు రెండు రోజులు ముందే ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జీవో 35ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. టికెట్ రేట్లను పెంచకూడదని, బ్లాక్లో టికెట్లు అమ్మరాదని వెల్లడించింది. అయితే ఈ నెలాఖరు వరకే ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితితో
'భీమ్లా నాయక్' విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్తో తెలంగాణలోని థియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అక్కడ బెన్ఫిట్ షోలకు అనుమతి లేకపోవడంతో పాటు టికెట్ రేట్లు పెంచకుండా చూసేందుకు.. అధికారులు సిద్ధం అయ్యారు. ఇందుకోసం హాళ్లపై దాడులు కూడా చేస్తున్నారు.

పవన్ సెటైర్లు.. ఫ్యాన్స్ హ్యాపీగా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చే కొన్ని డైలాగ్లు ఒక రాష్ట్రానికి చెందిన సీఎంను ఉద్దేశించి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాంటివి సినిమాలో చాలా ఉన్నాయని అభిమానులు సంబరపడుతున్నారు.

శుక్రవారం డైలాగ్కు స్పందన
'భీమ్లా నాయక్' మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానాతో 'ప్రతి శుక్రవారం వచ్చి సంతకం చేసి వెళ్లరా నా కొడకా' అంటూ చెప్పే డైలాగ్కు థియేటర్లలో విపరీతంగా స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ డైలాగ్ను వాడుతూ పవన్ అభిమానులు తెగ ట్వీట్లు చేస్తున్నారు. అలాగే, 'ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదురా.. నా చెల్లి పేరు చెప్పాల్సింది' అనే డైలాగ్ పేలుతోంది.


Click it and Unblock the Notifications











