అప్పట్లో అన్నయ్యతో కశ్మీర్ వెళ్లేవాడిని... ఆర్టికల్ 370 రద్దుపై పవన్ కళ్యాణ్!
ఆర్టికల్ 370 రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 1980ల్లో అన్నయ్య చిరంజీవి గారితో కలిసి కాశ్మీర్ వెళ్లేవాడిని. అపుడు ఇంకా కాశ్మీర్లో మిలిటెన్సీ రాలేదు. కాశ్మీరీలు చాలా ప్రేమగా ఉండేవారు. అప్పుడప్పుడే ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ల మీద హింస మొదలు పెట్టారు. అలా జరుగడం చూసి బాధేసేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
కశ్మీర్ అందం చాలా గొప్పది, అత్యంత సౌందర్యవంతమైన ప్రాంతం. అలాంటి ప్రాంతం విషయంలో కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతాన్ని దేశంలో అంతర్భాగంగా చేశారు. ఇది కొన్ని చోట్ల కొంత ఇబ్బంది కలిగించే అంశం అయినప్పటికీ పర్మినెంటుగా శాంతి సౌఖ్యాలు ఇస్తుందని నమ్ముతున్నాను. కాశ్మీర్ విషయంలో గొడవ వల్ల పాకిస్థాన్, ఇండియా మధ్య ఒక చిచ్చులా తయారైంది. ఆర్టికల్ 370 రద్దు వల్ల దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని, రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందుతూ గజెట్ విడుదలైంది. దీంతో 70 ఏళ్లుగా కశ్మీర్ విషయంలో కొనసాగుతున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దయినట్లయింది.
ఇప్పటి వరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ము అండ్ కాశ్మీర్.... ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము అండ్ కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము అండ్ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా, లద్దాక్ను అసెంబ్లీ లేని యూనియన్ టెర్రీటరీగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications