పవన్ వైజాగ్ సభ పోస్టర్ విడుదల(ఫొటో)
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27న విశాఖపట్టణంలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభ ప్రచారానికి గాను పోస్టర్లను సోమవారం విడుదల చేశారు. తొలిసారిగా పవన్ కల్యాణ్ పాల్గొంటున్న బహిరంగ సభ కావడంతో విజయవంతం చేసేందుకు ఆయన అభిమానులు కృషి చేస్తున్నారు.
"యూత్ ఆఫ్ ది నేషన్..ఫైట్ ఫర్ ది నేషన్''అనే నినాదంతో నిర్వహించే ఈ బహిరంగ సభలో ఆయన రాసిన 'ఇజమ్' పుస్తకాన్ని విడుదల చేస్తారు. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనుకొన్న బహిరంగ సభకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఫలితంగా సభను రెండు రోజులు ముందుగానే నిర్వహించి స్థానిక సమరం నుంచే రాజకీయంగా కాక పుట్టించేందుకు పవన్కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. జనసేన సిద్ధాంతాలను పూర్తిస్థాయిలో వెల్లడించి, వాటిని వివరించే ఇజం పుస్తకాన్ని విడుదల చేసేందుకు విశాఖను వేదికగా ఎంచుకొన్నారు.
ఈ నెల 29న సాయంత్రం భారీ సభను నిర్వహించాలనుకొన్నారు. అయితే 30న పురపాలక ఎన్నికలున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల తేదీకి 48 గంటల ముందే ప్రచార కార్యక్రమాలు జరపరాదు. ఇది గ్రహించి జనసేన నిర్వాహకులు తమ సభను 27న ఏర్పాటు చేసుకొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అభిమానులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్ స్థాపించిన కొత్త పార్టీ జనసేన తన విధానాన్ని ప్రకటించింది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుందని వెల్లడించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని పేర్కొంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవుదినాలుగా పాటించాలని నిర్ణయించింది.
జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టించినవే తప్ప జాతి సమగ్రత కోసం ఉద్దేశించినవి కావని జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయాల్లో నూతననాయకులను తయారుచేసే దిశగా పవన్ కల్యాణ్ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని, సమాజంలో పునాది స్థాయినుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది కల్యాణ్ లక్ష్యమని స్పష్టం చేసింది.
పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటికే వందల మంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్న జనసేన పార్టీ నెమ్మదిగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించింది. భాజపా ప్రధాని అభ్యరి నరేంద్ర మోడీతో పవన్ భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా చర్చించుకొంటున్నారు.దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పవన్, వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక సేవకులతో చర్చలు సాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











