‘దేనికైనా రెడీ’ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటీషన్
హైదరాబాద్: మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం వివాదం అనేక మలుపులు తిరుగుతూ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం వేసిన కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు హైకోర్టుగా వెళ్లగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇస్తూ... కమిటీపై స్టే విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు ఓకే చేసాక మళ్లీ కమిటీ వేయడం ఏమిటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
శుక్రవారం హైకోర్టు స్టే ఇచ్చిన కొద్ది గంటల్లోపే మరో పిటీషన్ హైకోర్టులో దాఖలైంది. 'దేనికైనా రెడీ' సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని రఘునాథరావు అనే లాయర్ కోర్టుకెక్కారు. సినిమా మొత్తం ఒక కులం వారిని కించ పరిచే విధంగా ఉందని, సెన్సార్ బోర్డు సభ్యులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ ఇచ్చారని, అది పూర్తిగా అవకతవకలతో కూడిన సెన్సార్ సర్టిఫికెట్ అని రఘునాథరావు తన పిటీషన్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ కమిటీపై స్టే విధించిన హైకోర్టు.... ఈ పిటీషన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా... దేనికైనారెడీ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలంటూ దిల్సుఖ్నగర్లోని కొత్తపేటలో బ్రాహ్మణ సంఘాలు చేస్తున్న దీక్షను శుక్రవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు నేతల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తీరుకు నిరసనగా బ్రాహ్మణులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


Click it and Unblock the Notifications











