బంది పోటు: ఆసక్తికరంగా రాజమౌళి స్పీచ్ (ఫోటోస్)
హైదరాబాద్ : ప్రముఖ దర్శకులు, స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ వారసులు ‘ఇవివి సినిమాస్' పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించడం...రాజేష్ నిర్మాతగా, అల్లరి నరేష్ హీరోగా ‘బంది పోటు' సినిమా కూడా మొదలు కావడం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
అల్లరి నరేష్, ఈషా జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కళ్యాణ్ కోడూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక సంక్రాంతి సందర్భంగా జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, ఎస్వీ కృష్ణారెడ్డి, కీరవాని, హరీష్ శంకర్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన సీడీలను ఆవిష్కరించారు.
రాజమౌళి మాట్లాడుతూ...''నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారు చిత్రసీమను ఏలుతూ ఉండేవాళ్లు. వాళ్లని చూసి, ఎలా డైరెక్టర్ అవ్వాలి అని ఇన్ ఫీరియార్టీ కాంప్లెక్స్ వచ్చేది. 'స్టూడెంట్ నం. 1 'అప్పుడు ఈవీవీగారిని కలిశాను. అప్పుడాయన నాతో ''హిట్ సినిమా తీస్తే ప్రేక్షకులు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు.. సినిమా ఫ్లాప్ అయితే ఎత్తి కుదేస్తారు. ఏదీ నిజం కాదు. ఏది నిజమో అది మనకు తెలియాలి'' అన్నారు. ఆ మాటలు చాలా ఆదర్శంగా అనిపించాయి. ఆయన బేనర్లో నరేశ్, రాజేష్ మళ్లీ సినిమాలు మొదలుపెట్టారు. మంచి హిట్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. కల్యాణ్ కోడూరిగారి పాటలు బాగుంటాయి'' అని చెప్పారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

అల్లరి నరేష్ మాట్లాడుతూ
''మా నాన్నగారు మమ్ముల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో, అంత కంటేఎక్కువగా కష్టపడి ఇ.వి.వి బ్యానర్ పేరుని నిలబెడతామని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ...
డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ - ''నరేష్ తో సినిమా చేయాలని చాలాసార్లు ప్రయత్నాలు చేసాను. కానీ కుదరలేదు. 'బందిపోటు' సినిమాతో కుదిరింనందుకు ఆనందంగా ఉంది. చాలా డిఫరెంట్ కథ. నరేష్ ని డిఫరెంట్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేసాను. మిగతా ఆర్టిస్ట్ లకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇ.వి.వి గారి బ్యానర్ లో తిరిగి సినిమాలు చేయడం ఆరంభించిన తర్వాత నేనే మొదటి సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ కోడూరిగారితో కలిసి నేను చేస్తున్న నాలుగో సినిమా ఇది. కళ్యాణ్ మంచి పాటలిచ్చారు. నాకు మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన రాజేష్, నరేష్ కి థ్యాంక్స్. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను'' అని అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -
'అదేంటో కానీ.. మేము అట్టర్ ఫ్లాఫ్ తో మొదలయ్యాం. హీరోగా నేను నటించిన తొలి చిత్రం 'ప్రేమించు పెళ్లాడు' అట్టర్ ఫ్లాప్. అలాగే, దర్శకునిగా ఈవీవీ 'చెవిలో పువ్వు' అపజయంపాలైంది. దాంతో 'నేను దర్శకత్వానికి పనికి రానేమో' అని ఈవీవీ అంటే, 'మనకు భగవంతుడు చెప్పిన లెసన్ ఇది' అన్నాను. ఆ తర్వాత 'అప్పుల అప్పారావు'తో హిట్ కొట్టాడు. ఈవీవీ సినిమా ఎప్పటికీ విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నా'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ
నాన్నగారి బ్యానర్లో ప్రెస్టీజయస్గా రూపొందిస్తున్న సినిమా ఇది. జనవరి1, 2000లో మా సంస్థను ప్రారంభించాం. ఈవీవీ బ్యానర్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ప్రజలు ఎదురుచూసే విధంగా ఏడాదికి ఒకటీ, రెండు మంచి సినిమాలను ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.

నటీనటులు
చంద్రమోహన్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రఘుబాబు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం - కళ్యాణి కోడూరి, ఛాయాగ్రహణం - పీజీ విందా, ఎడిటింగ్ - శ్రవణ్ కటికనేని, ఆర్ట్ - ఎమ్.కిరణ్ కుమార్.


Click it and Unblock the Notifications











