సంజయ్ దత్ బ్యాక్ టు జైలు.... (ఫోటోస్)
ముంబై: జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ రెండు వారాలపై పెరోల్పై విడుదలైన సంగతి తెలిసిందే. గురువారంతో ఆయన గడువు ముగియడంతో తిరిగి ఎరవాడ జైలుకు వెళ్లి పోయారు. మరో 14 రోజుల పాటు పెరోల్ పొడగించాలని అతను జైలు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అధికారులు అందుకు నిరాకరించారు.
సాధారణంగా అత్యవసర పరిస్థితులు ఉంటే పెరోల్ పొడగించే అవకాశం ఉండేది. అయితే సంజయ్ దత్ విషయంలో అలాంటి కారణాలే ఏమీ లేక పోవడంతో అధికారులు అందుకు నిరాకరించారు. అసలు ఆయనకు తొలుత 14 రోజులు పెరోల్ ఇవ్వడమే వివాదం అయిన సంగతి తెలిసిందే. ఆయనకు పెరోల్ ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ కూడా జరిపింది.

తన సెలవుల్లో న్యూఇయర్ కూడా వచ్చేట్లు చూసుకున్నాడు సంజయ్ దత్. ఒక ప్లాన్ ప్రకారం.....న్యూఇయర్ పార్టీలో ఎంజాయ్ చేయడానికే సంజయ్ దత్ సెలవు తీసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. మరి సంజయ్ దత్ పార్టీ చేసుకున్నాడా? లేదా? అనే సంగతి తెలియదు కానీ తన గడువు దగ్గర పడటంతో మళ్లీ సెలవు కావాలని అధికారులకు వినతి పెట్టుకోవడం కూడా హాట్ టాపిక్ అయింది. అధికారులు అందుకు నిరాకరించడంతో సంజయ్ దత్ ఈ రోజే జైలు బాట పట్టక తప్పలేదు.

1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.



Click it and Unblock the Notifications











