రజనీకాంత్ కూలి సినిమా నిర్మాతలకు టెన్షన్.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 14న తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఓవర్సీస్ లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు కూలి విడుదల సందర్భంగా కీలక నిర్ణయం చేసింది. దాంతో రజనీకాంత్ కూలి చిత్రానికి మరింత భద్రత లభించింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇండియన్ సినిమాను పట్టి పీడిస్తున్నది పైరసీ భూతం. ఏ భాష అయినా సరైన సినిమా ఓపెనింగ్ రోజే కొన్ని వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. దాంతో ఎన్నో కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, ఎంతో సమయం కేటాయించి, ఎంతగానో శ్రమించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల శ్రమ కూడా వృథా అయిపోతోంది. ముఖ్యంగా థియేటర్లలోకి పైరసీ వల్ల ఫూట్ ఫాల్ పడిపోతోంది. దీంతో నిర్మాతలకు సినిమాలు బాగున్నాయని టాక్ వస్తున్నా ఫైనాన్షియల్ గా మాత్రం ఫలితాలు లేకుండా పోతున్నాయి. అన్నీ భాషల్లో పైరసీకి అడ్డుకట్ట లేకుండా పోయింది.

2025 జనవరి నుంచి విడుదలైన మేజర్ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పైరసీకి గురైన సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇటీవల విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రం కూడా పైరసీకి గురైంది. ఇక ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలి చిత్రానికి కూడా ఇదే భయం పట్టుకుంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ముందుగానే జాగ్రత్తలు వహించింది.
ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో కూలి చిత్రానికి సంబంధించిన కాపీ రైట్స్ ఉల్లంఘనపై పిటిషన్ ధాఖలు చేశారు. దాంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామమూర్తి భద్రత కల్పిస్తూ తీర్పునిచ్చారు. 36 మోసపూరిత సైట్లను వెంటనే నిలిపి వేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా సినిమాలను పైరసీ చేయడం నిర్మాతలకు భారీ కోలుకోలేని గాయమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఇల్లీగల్ కు పాల్పడే వారే కాకుండా భవిష్యత్ లో చేసే యోచన ఉన్న వెబ్ సైట్లపైనా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక కూలి చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్స్ వరల్డ్ వైడ్ గా జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 50 కోట్లకు పైగా అడ్వాన్స్ బుక్కింగ్స్ ద్వారా వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక కూలి చిత్రంపైనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక అమీర్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్, పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో నటించడం విశేషం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత కళానిధి మారన్ 350 కోట్ల రూపాయలతో నిర్మించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











