AP Counting Day పవన్ కళ్యాణ్ ను ఓడించమని వందల కోట్ల ఆఫర్..నన్ను కొనే సత్తా ఉందా? : వర్మ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారిన సెగ్మెంట్ పిఠాపురం. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు మెగాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ బరిలో నిలిచారు. ఆయన కోసం మెగా ఫ్యామిలీ, సినీ పరిశ్రమ కదిలొచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం నిర్వహించారు.
అయితే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు పవన్ రాకతో నిరాశ ఎదురైంది. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు కష్టపడి పార్టీని పటిష్టం చేసిన వర్మను కాదని పిఠాపురం సీటును వర్మకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది.

అయితే ఆయన సత్తా, శక్తి సామర్ధ్యాలు ఏంటో తెలిసిన చంద్రబాబు తక్షణం వర్మను పిలిపించి మాట్లాడారు. బాబు హామీతో మెత్తబడిన వర్మ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. పవన్ను ఓడించడానికి సీఎం జగన్ వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను ధీటుగా తిప్పికొట్టడంలో వర్మ కీలకపాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగా పోలింగ్ నాడు దేశ విదేశాల నుంచి ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ విజయం ఖాయమని, ఈసారి ఆయనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరూ అడ్డుకోలేరని వర్మ ఘంటాపథంగా చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ను ఎన్నికల్లో ఓడించాలని తనకు భారీ మొత్తం ఆఫర్ చేశారని వ్యాఖ్యానించారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనగానే చాలా ఒత్తిళ్లు వచ్చాయని.. కానీ తనను ఎవ్వరూ కొనలేరని వర్మ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వారిద్దరితో పాటు నేను కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.
పిఠాపురం బరిలోంచి తప్పుకుంటానని చంద్రబాబుకు చెప్పి మరుసటి రోజు నుంచే పని మొదలుపెట్టానని వర్మ పేర్కొన్నారు. తన భార్య, కుమారుడు సైతం తనకు ఎంతో సహకరించారని.. పవన్ కోసం వారిద్దరూ నియోజకవర్గం మొత్తం తిరిగారని చెప్పారు. తన సొంత బావమరిదికి ఆపరేషన్ జరుగుతున్నా.. తాను ఊరు వదిలితే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో పిఠాపురాన్ని వదిలి వెళ్లలేదని వర్మ తెలిపారు.

చంద్రబాబుకు అతిపెద్ద మద్ధతుదారుడినని, కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు సహజమని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచే తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని కానీ తాను కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తినని స్పష్టం చేశారు. తనకు ఇద్దరు అధ్యక్షులున్నారని.. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్ అని వర్మ చెప్పారు. వారిద్దరూ తనకు ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని కుండబద్ధలు కొట్టారు.


Click it and Unblock the Notifications











