ట్రైలర్ చూసి సినిమా ఆపితే ఎలా? ‘పిఎం నరేంద్రమోదీ’ మూవీపై సుప్రీం!
'పిఎం నరేంద్రమోదీ' మూవీపై లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు విడుదల కావకుండా ఎన్నికల సంఘం నిషేదం విధించిన నేపథ్యంలో దర్శక నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. 'పీఎం నరేంద్రమోదీ' సినిమా చూసిన తర్వాతే దీన్ని రిలీజ్ చేయాలా? వద్దా? అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలని సూచించింది.
సోమవారం(ఏప్రిల్ 15) కేసు విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి నిర్మాతల తరుపున వాదించారు. ఎన్నికల సంఘం సినిమా చూడకుండా నిర్ణయం తీసుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. కేవలం ట్రైలర్ చూసి నిర్ణయం తీసుకోవడం సరికాదని తెలిపింది. సినిమా చూసిన తర్వాత ఎన్నికల సంఘం సినిమాపై తమ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు అందించాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు సూచనపై స్పందించిన ఎన్నికల సంఘం... సినిమా చూసి తమ నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో అందించడానికి శుక్రవారం(ఏప్రిల్ 19) వరకు సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అందుకు అంగీకరించిన కోర్టు కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

'పిఎం నరేంద్రమోదీ' చిత్రం ఏప్రిల్ 11న విడుదలవ్వాల్సి ఉండగా... విడుదలకు ఒక రోజు ముందు ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి ఈచిత్రం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ విడుదల నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దర్శక నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సందీప్ సింగ్ నిర్మాతగా ఓమంగ్కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రను వివేక్ ఓబెరాయ్ పోషించారు. ఆయన బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











