మరో వివాదంలో విరాటపర్వం.. బాన్ చేయండంటూ పోలీసు కేసు
దగ్గుబాటి రానా హీరోగా విరాటపర్వం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంది. ఇప్పటికే సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల వల్ల ఒక వివాదంలో చిక్కుకోగా, ఆ వ్యాఖ్యల మీద సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.. ఇప్పుడు తాజాగా మరోసారి సినిమా వివాదంలో చిక్కుకుంది. దీంతో సినిమా మీద కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

బ్యాన్ చేయాలంటూ
నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17వ తేదీన ఘనంగా విడుదలైంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ కి ప్రస్తుతం గో రక్షకులు అంటూ ముస్లిమ్స్ మీద దాడి చేస్తున్న వారికి పెద్దగా తేడా లేదు అంటూ అర్థం వచ్చేలా మాట్లాడడంతో పెద్ద వివాదం రేగింది. ఇక ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడిచాయి.

కించ పరిచే సన్నివేశాలు
నిజానికి ఈ విషయం మీద తొలుత స్పందించడానికి ఇష్టపడని సాయిపల్లవి తర్వాత ఒక వీడియో మెసేజ్ విడుదల చేసింది. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో . విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. అజయ్ ఫిర్యాదులో.."విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని, పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు.

విప్లవభావాలు వైపు
అంతేకాక విరాటపర్వం సినిమాలో చాలా అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలి" అని కోరారు. ఇక భారత్ లో నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చింది అని ప్రశ్నిస్తూ విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సినిమా యువత మనసులు చెడగొట్టి వారిని విప్లవభావాలు వైపు నడిపించే విధంగా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తూము సరళ
గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకున్నారని ఇప్పుడు కూడా సినిమా పరిశీలించి మరోసారి అవసరమైతే రీ సెన్సార్ చేయించి సినిమా విడుదల చేయాలని, లేదా బ్యాన్ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజానికి ఈ సినిమా వరంగల్ కు చెందిన తూము సరళ అనే యువతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు దర్శకుడు వేణు సినిమా విడుదలయ్యే ముందు ప్రకటించారు.

చదువుకునే రోజుల్లో
సరళ అనే యువతి ఈ నక్సలిజం వైపు ఆకర్షితురాలై చదువుకునే రోజుల్లో నక్సలిజం వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. నిజంగానే సరళ బయటకు వెళ్లిన విషయం తెలుసు కానీ మళ్ళీ తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సినిమాలో సాయి పల్లవి పాత్ర పోలీస్ ఇన్ ఫార్మర్ అనే నెపంతో చంపి వేయబడుతుంది. నిజజీవితంలో కూడా అలాగే జరిగిందని కొన్ని కథనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











