రామ్ చరణ్కు పోలీసుల ఝలక్, రంగంలోకి మంత్రి చిరు?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని శిల్పకళా వేదికలో వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరించారు. ఇటీవల 'బాద్ షా' ఆడియో వేడుకలో అభిమాని మరణించిన నేపథ్యంలో పోలీసులు ఇకపై సినిమా వారికి సంబంధించిన వేడుకలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
మరో వైపు అభిమానులకు కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫంక్షన్లకు హాజరై ఇబ్బందులు పడవద్దని వివిధ జిల్లాల్లోని అభిమాన సంఘాలకు పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి కొడుకు అనే విషయాన్ని మరిచి పోలీసులు ఇలా వ్యవహరించడంపై మెగా వర్గానికి చెందిన పలువురు ఆగ్రహంగా ఉన్నారు. వెంటనే పోలీసుల తీరుపై చిరంజీవికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఇలా నిర్వాహకులపై నిందలు వేసి, సినిమా ఫంక్షన్లు జరుగకుండా అడ్డుకోవడం ఏమిటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్ లో సినిమా ఫంక్షన్లపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని, దీని వల్ల సినిమాలకు పరోక్షంగా ఎంతోకొంత నష్టం వాటిల్లుతుందని అభిప్రాయ పడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న చిరంజీవి చొరవతో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు అనుమతి వస్తుందా? రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు మెత్తబడతారా? మరి ఏం జరుగబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











