Bhola Shankar: చిరంజీవికి ఎదురుదెబ్బ.. భోళా శంకర్ నిలిపివేత.. పోలీసుల బందోబస్తు
ఎంతోకాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన ఈ సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇలా సినిమాలపై జోరు పెంచుతోన్న మెగాస్టార్ తాజాగా నటించిన మూవీ భోళా శంకర్ (Bhola Shankar). అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ఆగస్ట్ 11న అంటే శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా భోళా శంకర్ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఒకచోట చుక్కెదురు అయింది. అసలు ఏమైందనే విషయంలోకి వెళితే..
చాలా గ్యాప్ తర్వాత:మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించారు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత బిల్లా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మించారు.

నెట్టింట్లో వైరల్:సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంశంగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో సుశాంత్, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇదివరకే పోస్టర్లు, పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు ఆగస్ట్ 11న థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాలోని పలు సీన్లు సోషల్ మీడయాలో గింగిరాలు తిరుగుతున్నాయి. వాటికి మంచి స్పందన లభిస్తోంది.

అడ్డుకున్న పోలీసులు:ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిరు మేనియా కనిపిస్తోంది. అయితే భోళా శంకర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో ఎదురుదెబ్బ తగిలింది. బాపట్లలోని ఎస్ఎస్వీ (SSV Theater) థియేటర్ లో భోళా శంకర్ సినిమాను నిలిపివేశారు. అనుమతి లేకపోయినా అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారనే కారణంతో సినిమా ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. అయితే చిరంజీవి సినిమాను కావాలనే కక్ష్యపూరితంగా అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బందోబస్తు:ఇక బాపట్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. కాగా భోళా శంకర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల పెంపునకు అనుమతి లభించలేదన్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కారును భోళా శంకర్ మూవీ యూనిట్ కోరింది. అందుకు దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని టికెట్ల పెంపునకు ప్రభుత్వం తిరస్కరించిందని తెలిసిందే.
తప్పుడు ప్రచారం:వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన విమర్శల కారణంగానే సర్కారు టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారంలో నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ తెలిపింది. టికెట్ రేట్లు పెంచడానికి గల సరైన పత్రాలను సమర్పించపోవడం వల్లే టికెట్ రేట్లు పెంచలేదనే సారాంశంతో ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











