పొలిటికల్ గేమ్ కూడా అయి ఉండొచ్చు.. మీరాచోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదంపై పూనమ్ కౌర్
మీరా చోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం రోజు రోజుకూ మరింత పెరిగిపోతోంది. మీరా చోప్రా ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో తనను అసభ్య పదజాలంతో దూషించన వారందరిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం తన గోడును విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించి.. తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చాడు. దీంతో మీరా చోప్రా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిసింది. అయితే తాజాగా ఈ వివాదంపై పూనమ్ కౌర్ స్పందించింది. అసలింతకీ గొడవ ఏంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

గొడవ అలా మొదలు..
మీరా చోప్రా తన అభిమానులతో ట్విట్టర్లో చాట్ చేసింది. ఈ క్రమంలో జూ ఎన్టీఆర్ గురించి చెప్పండని అడిగితే.,. అతను ఎవరో తెలీదని, ఆయన ఫ్యాన్ను కాదని చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. ఇంట్లో వారి నుంచి ఎవ్వరినీ వదలి పెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

వివాదమైన వార్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ శృతిమించడంతో మీరా చోప్రా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు చిన్మయి సలహాతో నెటిజన్ల కామెంట్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సేకరించింది. వీటితో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.

భిన్న స్వరాలు..
మీరా చోప్రా వివాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిని పట్టించుకోవద్దని కొందరు అంటే.. వదల కూడదని మరికొందరు అంటున్నారు. ఈ వ్యవహారం కుష్భూ పరోక్షంగా స్పందిస్తూ..కొందరు ఆడవాళ్లు మారరు, వినిపించుకోరు అని చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. తాజాగా పూనమ్ కౌర్ కూడా స్పందించింది.

రాజకీయ లాభం కోసం..
మీరాచోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు ఎత్తకుండా పూనమ్ చేసిన కామెంట్స్ అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ల సారాంశం ఏంటంటే.. ‘ఆ అకౌంట్స్ ఫేక్ కావొచ్చు.. ఏదైనా రాజకీయ పార్టీ ఇదంతా కావాలని చేసి ఉండొచ్చు.. వారి స్వలాభం కోసం కావాలని ఇలా చేసి ఉండొచ్చు ఎవరికి తెలుసు. మన ఇండస్ట్రీ అనేది రాజకీయాలతో ముడి పడి ఉంది.. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. అభిమానులు ఎప్పుడూ అమాయకులే. కొన్ని పార్టీ, నాయకులు మాత్రం దుష్టశక్తులు. అలాంటి వారే ఇలా చేస్తారు.

దిగులు పడకండి ముందుకు సాగండి..
ఏ నటుడు కూడా తన ఫ్యాన్స్ ఇతరులను తిట్టాలని ప్రేరేపించడం, అనుకోరు కూడా. చుట్టూ ఉన్నవారు మీడియా అలా చేస్తారని భ్రమ కల్పిస్తారు. అలా చేయించడానికి నటులకు సమయమే ఉండదు. ట్రోలింగ్ అనేది నటుల జీవితంలో సర్వసాధారణం. క్రిమినల్ చర్యలను తప్పకుండా ఫిర్యాదు చేయాలి. ట్రోలింగ్ అనేది మనల్ని బాధపెట్టడానికే. మీరేమీ దిగులు పడకండి. ముందుకు సాగండి.

అభిమానులను నిందించకండి..
ఎలాంటి కారణాలు లేకుండా గత కొన్నేళ్ల నుంచి నా పేరును కూడా బజారు కీడ్చుతున్నారు. కానీ నేనింత వరకు ఏ అభిమానిపైనా ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ అమాయకులని నేను నమ్ముతాను. మధ్యలో ఉన్నవారే కావాలనే వారి లాభం కోసం అలా ఆడిస్తారు. నన్ను ఇబ్బందిపెట్టిన వారిపైనే ఫిర్యాదు చేశాను. అభిమానులను నిందించకండి' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











