ఆలయానికి పవన్ 1.32 కోట్ల విరాళం.. అన్నదాన కార్యక్రమంలో సామాన్యుడిలా!
Recommended Video

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హంగామా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఏంటనేది మే 23న తేలనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పోటీలో నిలిచింది. ప్రచారం కోసం పవన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు పవన్ తీరికలేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగియడంతో పవన్ కళ్యాణ్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రోజు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పర్యటించారు.

పార్టీ ఆఫీస్లోనే
ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ ఆఫీస్ లో పవన్ ఒంటరిగా నేలపై విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికలు ముగిసాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక ఎక్కడికి పర్యటించారని అంతా భావించారు. కానీ పవన్ శుక్రవారం రోజు గుంటూరు జిల్లాలో పర్యటించారు.

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఆ ఆలయాన్ని పవన్ సందర్శించారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలసి పవన్ ఈ ఆలయాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామిని సందర్శించి అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అంతే కాదు.. ఆలయంలో పవన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులలో సామాన్యుడిలా మారి అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వడ్డించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1.32 కోట్ల విరాళం
నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి పవన్ 1.32 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఆలయ ధర్మ కర్త సమక్షంలో పవన్ తన విరాళం ప్రకటించారు. ఆలయంలో నిత్య అన్నదాన పథకం కోసం తన విరాళాన్ని ఉపయోగించాలని పవన్ కోరారు. స్వామివారికి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. జనసేన పార్టీ నేతలు, నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిగిపించారు.

సర్వత్రా ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం పార్టీకి, టిడిపి, బిజెపి కూటమికి ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహించారు. కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ విజయం పట్ల అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తొలిసారి బరిలో నిలిచిన జనసేన పార్టీ ఎలాంటి ఫలితాలని ఎదుర్కొనబోతోందో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











