ప్రభాస్, అనుష్క చైనా టూర్.. అందుకోసమేనా.. జోరందుకున్న వార్త
బాహుబలి2 చిత్రంలో ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా చిత్రీకరించారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి2 విడుదల తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వైరల్గా మారింది.
బాహుబలి2 చిత్రంలో ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా చిత్రీకరించారు దర్శకుడు రాజమౌళి. వారిద్దరి పాత్రలు అభిమానులకు కన్నుల పండువగా మారాయి. అందుకే ప్రేక్షకులు ఈ జంటకు నీరాజనం పట్టారు. గతంలో వీరిద్దరు నటించిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో బాహుబలి2 విడుదల తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వైరల్గా మారింది. ఇలాంటి వార్తల నేపథ్యంలో చైనాలో పర్యటించడానికి ప్రభాస్, అనుష్క వెళ్తున్నారనే వార్త మరింత ఆసక్తిని రేపుతున్నది.

చైనా పర్యటనకు బాహుబలి టీమ్
బాహుబలి2 చిత్రం విదేశాల్లో కలెక్షన్ల మోత మోగించింది. చైనాలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ చిత్ర ప్రచారం కోసం ప్రభాస్, అనుష్కల జోడిని రంగంలోకి దించాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ వార్త నిజమైతే.. ప్రభాస్, అనుష్క జంటను చూడటానికి చైనా సినీ ప్రేక్షకులకు మంచి అవకాశం దక్కినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

చైనా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు..
బాహుబలి సినిమా షూటింగ్లో ఐదేళ్లపాటు సరదాగా గడిపిన ప్రభాస్, అనుష్కలకు చైనా పర్యటన మరో విహారయత్ర కానున్నది. సినిమా ప్రమోషన్ కోసం వీరిద్దరూ చైనాలో పర్యటిస్తే సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందనే మాట వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా విభిన్నమైన అభిరుచి ఉన్న ప్రేక్షకులను కలువడం ఈ జంటకు కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉంది.

పారిశ్రామికవేత్త మనవరాలితో ప్రభాస్ పెళ్లి
అనుష్కతో ప్రభాస్కు అఫైర్ కొనసాగుతున్నదని ఓ వైపు జోరుగా రూమర్లు చెలరేగుతుంటే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనవరాలితో ప్రభాస్ పెళ్లి జరుగుతున్నదనే వార్త ఈ మధ్యకాలంలో హల్చల్ చేస్తున్నది. అయితే ఈ వార్తపై ప్రభాస్ కుటుంబం గానీ, అటు పారిశ్రామికవేత్త కుటుంబం గానీ స్పందించకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

అనుష్క పెళ్లికి ప్రయత్నాలు
ఇదిలా ఉండగా, అనుష్క పెళ్లి విషయం గురించి ఆమె కుటుంబం తీవ్రంగా దృష్టిపెట్టిందనే వార్త మీడియాలో నలుగుతున్నది. ఇటీవల కర్ణాటకలోని ఓ ఆలయంలో అనుష్క పూజలు నిర్వహించింది. ఆ పూజ పెళ్లికి ముందు నిర్వహించేదే అనే విషయం ప్రముఖంగా వినిపిస్తున్నది.

అనుష్క పేరు సిఫారసు
ఇలాంటి వార్తలు వస్తుండగానే.. సాహో చిత్రంలో అనుష్కను ప్రభాస్ రికమండ్ చేశాడు. కత్రినాకు బదులు దేవసేనను తీసుకోవాలని నిర్మాతలకు సూచించాడు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అనుష్కను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటన రాకపోవడం అది రూమర్గానే మిగిలింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.

దంగల్ ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కొందాం
అనుష్క, ప్రభాస్ల గురించి నానా రకాలుగా గాలివార్తలు వినిపిస్తున్నా.. చైనాలో దంగల్ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని బాహుబలి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దంగల్ ఇప్పటికే రూ.1000 కోట్లు వసూలు చేసి ఇంకా జోరును కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా మార్కెట్లో పగా వేసేందుకు బాహుబలి నిర్మాతలు తమ వ్యూహాలను రచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











