ప్రధాని మోడీకి నాకు శత్రువు ఒకరే.. సీఎం కేసీఆర్ బంగారం.. ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కరోనా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో గృహ నిర్బంధంలో ఉంటూ సోషల్ డిస్టెన్స్ను పాటిస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా కష్టాలు పడుతున్న పేద ప్రజలకు తనకు తోచిన విధంగా ఆయన సహాయం అందిస్తున్నారు. తాజా ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో లైవ్ చర్చలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడారు. కరోనా పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ..

ప్రకృతి ఒడిలో ఉంటూ
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ విధించడంతో ప్రకృతికి చేరువయ్యాను. నా భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో నా వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు తోట పనులు చూసుకొంటూ ఫ్యామిలీతో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఉన్న దాంట్లో కొంత మొత్తాన్ని నా చుట్టుపక్కల ఉన్నవారితో పంచుకొంటున్నాను. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొంటున్నాను అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

పరిస్థితులను చక్క దిద్దాలే తప్ప..
కరోనా పరిస్థితులు ప్రత్యేకమైనవి. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. సమాజంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దే వారికి, మన చుట్టు పక్కల ఉన్న వారికి సహాయం చేసే విషయంపై దృష్టిపెట్టాలి. అంతే గానీ వ్యక్తిగత విభేదాలకు, విమర్శలకు ఇది సమయం కాదు. అందరూ కలిసి పోరాటం చేయాల్సిన సమయమిది అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో నాకు విభేదాలు
ప్రధాని మోదీతో నాకు విభేదాలు ఉన్నాయనేది వాస్తవం. వ్యక్తిగతంగా ఆయనతో శతృత్వం లేదు. ప్రధానిగా ఆయన విధానాలను వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఆయనకు, నాకు ఒకే ఒక శత్రువు కరోనావైరస్. దానిని తుదముట్టించడానికి మేమిద్దరమే కాకుండా ప్రజలంతా కలిసి యుద్ధం చేయాలి. ప్రజల ద్వారా ఎన్నుకొన్న ప్రధాని తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతించాలి. వారి ఆలోచనలను ప్రజలను ముందుకు తీసుకెళ్లాలి. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత వాటి వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందా అనే దానిపై సద్విమర్శలు చేయాలి అని అన్నారు.

అప్పు చేసే సహాయమందిస్తా
ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ విరాళాలు సేకరించి సహాయం చేయదు. నా సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలను చేస్తాను. లేకపోతే అప్పు చేసి ఇతరులకు సహాయం చేస్తాను. నేను డబ్బు సంపాదించిన తర్వాత నేను అప్పులను తీర్చుకొంటాను. నేను అడిగితే ఎవరైనా అప్పు ఇస్తారు. కానీ ఈ పరిస్థితుల్లో అలా చేయడం సరికాదు అని అన్నారు. నా ఫామ్హౌస్లో వలస కార్మికులకు భోజనం, ఇతర సౌకర్యాలను కల్పించి ఆశ్రయం ఇస్తున్నాను అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Recommended Video

సీఎం కేసీఆర్ బంగారం
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కగా స్పందిస్తున్నారు. ఆయన ప్రజలకు ఇచ్చే భరోసా అందరికి ధైర్యాన్ని ఇస్తున్నది. నన్ను చంపుతామని బెదరించిన వాళ్ల నుంచి నాకు ప్రాణ రక్షణ కల్పిస్తారని కేసీఆర్ గతంలో భరోసా ఇచ్చారు. ఆయన మనసు బంగారం లాంటిది. ఆయన వ్యక్తిత్వం గొప్పది అంటూ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.


Click it and Unblock the Notifications











