పవన్ షూటింగులో జాయినైన గ్రేట్ యాక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ హీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. తాజాగా ఈచిత్రం షూటింగులో గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని సమాచారం. ప్రత్యేకమైన మ్యానరిజంతో ప్రకాష్ రాజ్ పాత్రను పూరి తీర్చిదిద్దాడని, అది విన్న ప్రకాష్ రాజ్ వెంటనే ఓకే చేసాడని ఫిల్మ్ నగర్ టాక్.
స్క్రిప్టు విన్న ప్రకాష్ రాజ్...ఈ మధ్య కాలంలో నేను విన్న స్క్రిప్టులో బెస్ట్ స్క్రిప్టు ఇది..చాలా నిజాయితీగా ఉంది. నా కెరీర్ లో మరో పేరు తెచ్చి పెట్టే పాత్ర అవుతుంది అన్నారు. పూరీ జగన్నాధ్ గతంలో రూపొందించిన బద్రీ చిత్రంలో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పోటా పోటీగా ..నందా..నందా..నందా అంటే...నువ్వు నందావైతే నేను బద్రీ..బద్రీనాధ్ అంటూ చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈచిత్రంలో పూరి వీరి మధ్య ఎలాంటి డైలాగులు ప్లాన్ చేసారనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి పక్కా ప్లాన్తో పూరి షూటింగ్ త్వరిత గతిన కానిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా నటిస్తున్న ఈచిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.


Click it and Unblock the Notifications











