నేను తప్పు చేయలేదు, ఆ వ్యక్తి వల్లే : ప్రకాష్ రాజ్
హైదరాబాద్: నేను ఏ తప్పూ చేయలేదని, నాపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారితో భేటీ అయిన తర్వాత నాపై జరుగుతున్న రాద్దాంతం వెనక ఉన్న వ్యక్తి ఎవరో బయట పెడతానని ఆయన తెలిపారు.
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలకపాత్రకు ఎంపికైన ప్రకాష్ రాజ్ షూటింగులకు లేటుగా హాజరు కావడం, అసిస్టెంట్ దర్శకుల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటి కారణాలతో ఆయన్ను తొలగించారు. ఆ స్థానంలో సోనూ సూద్ను తీసుకున్నారు. ఓ కోడైరెక్టర్ ఆయనపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో....ప్రకాష్ రాజ్పై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.....'తనకు, ఓ అసిస్టెంట్ డైరెక్టర్కు గొడవ జరిగిన మాట నిజమే. కానీ చిన్న గొడవను పెద్దది చేసి చూపెడుతున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారు. ఆయనే నాపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయించారు' అని తెలిపారు.
అక్కడ జరిగిన గొడవలో తప్పు ఎవరిదో గుర్తించకుండా నన్నే దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వారితో భేటీ అవుతున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదనడానికి నా వద్ద వీడియో సాక్ష్యం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద నమ్మకం ఉంది. నాపై ఇదంతా చేయిస్తున్న వ్యక్తి ఎవరనే విషయం త్వరలోనే బయట పెడతాను అన్నారు.
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....ప్రకాష్ చెబుతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, దర్శకుడు శ్రీను వైట్లే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజం ఎంతో ప్రకాష్ రాజ్ నోరు విప్పితే తప్ప తెలిసే అవకాశం లేద. వీరి మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి అనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











