Bheemla Nayak ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకో.. సినీ రంగంపై మీ ప్రతాపమా? జగన్ సర్కార్పై ప్రకాశ్ రాజ్ ఫైర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత చాలా రోజులుగా మౌనం పాటిస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయపరంగా పావులు వేగంగా కదుపుతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ తెర మీద బ్రహ్మండంగా తన వ్యూహాలను అమలు చేస్తున్నాడు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ప్రకాశ్ రాజ్.. భీమ్లా నాయక్ వివాదంపై ఘాటుగా స్పందించాడు. ఏపీ ప్రభుత్వ తీరుపై డైరెక్ట్గా ఎటాక్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక ప్రకాశ్ రాజ్ దూకుడు గురించిన వివరాల్లోకి వెళితే..

మా ఎన్నికల పరాజయం తర్వాత
మా ఎన్నికల తర్వాత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం బృందంలో ఒకడిగా కనిపించడం అందర్నీ షాక్కు గురి చేసింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రకాశ్ రాజ్ సపోర్ట్ చేయడం తెలిసిందే.

సీఎం కేసీఆర్తో కలిసి
ఇక మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ తర్వాత ప్రకాశ్ రాజ్ గురించి సంచలన రీతిలో ఊహాగానాలు చోటుచేసుకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకాశ్ రాజ్ను రాజ్యసభకు పంపిస్తున్నారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై అటు ప్రకాశ్ రాజ్ గానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ స్పందించకపోవడంతో ఆ వార్తలు ఊహగానాలుగానే మిగిలిపోయాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన
ఇలాంటి వార్తలు, ఊహగానాల మధ్య ప్రకాశ్ రాజ్ మరోసారి మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను ప్రకాశ్ రాజ్ సందర్శించడం విశేషంగా మారింది. అయితే ప్రకాశ్ రాజ్ వెంట ఎన్నికల విశ్లేషకుడు, సెఫాలజిస్టు ప్రశాంత్ కిషోర్ కూడా వెళ్లడం మరింత ఆసక్తికరంగా మారింది.

భీమ్లా నాయక్పై కక్ష సాధింపా?
ఇక తెలుగు సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యను ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. భీమ్లా నాయక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టి.. దయచేసి ఈ వివాదానికి ముగింపు పలకండి. సినిమాను బతికించే ప్రయత్నం చేయండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా భీమ్లా నాయక్ సినిమాపై జరుగుతున్న దాడిని ఖండించాడు.

అధికార దుర్వినియోగం ఎందుకు?
భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణ ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా వ్యక్తిగత, సిద్దాంతపరంగా విభేదాలు ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు.. ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు అంటే ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సిని, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది.


Click it and Unblock the Notifications











