Bheemla Nayak విషయంలో ఏపీ ప్రభుత్వం మీద ప్రకాష్ రాజ్ ఫైర్.. క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?
ఆంధ్రప్రదేశ్ లో భీమ్లా నాయక్ సినిమా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని రూల్స్ పాటించకపోతే థియేటర్లను సీజ్ చేసే విషయంలో ఏమాత్రం వెనుకాడేది లేదని చెబుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నాగబాబు విరుచుకుపడగా తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫిబ్రవరి 25వ తేదీన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రానా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ సాధించింది.

రికార్డు స్థాయిలో
విడుదల చేసిన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించడంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టికెట్ రేట్లు భారీగా తగ్గింపు ధరలకు ఉండడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటిదాకా పెద్దగా స్పందించిన వారు ఎవరూ లేరు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రం ఈ విషయం మీద స్పందించారు.

పగ తీర్చుకునే ఉద్దేశం లేదు
ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏమో తమకు పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకునే ఉద్దేశం లేదు అని చెబుతోంది. ఫిబ్రవరి 25వ తేదీకి ఎక్కడా జీవో ఇస్తామని మేము ఎక్కడా చెప్పలేదు కానీ ఏదో మోసం చేసినట్లు మాట్లాడుతున్నారు ఏమిటి అంటూ ప్రశ్నిస్తోంది. తమ మంత్రి చనిపోవడంతో జివో జారీ చేయడం లేట్ అయింది కానీ లేకుంటే ఇప్పటికే జీవో జారీ చేసి ఉండేవాళ్లమని చెబుతున్నారు మంత్రులు. అయితే ఇప్పటిదాకా అసలు ఈ అంశం మీద ఏమాత్రం స్పందించని ప్రకాష్ రాజ్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం మీద స్పందించారు.

క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా?
సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్రాజ్ ఘాటుగా స్పందించారు. ''సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగం మీద అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు. ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు..? అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరు'' అని పేర్కొన్నారు.

మల్లన్న సాగర్ రిజర్వాయర్ను
ఇదిలా ఉంటే మరోపక్క ప్రకాశ్రాజ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి శనివారం తెలంగాణలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను కూడా ఆయన పరిశీలించారు. అంతకు ముందు శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్ను సందర్శించారనీ సమాచారం.


Click it and Unblock the Notifications











