NTR 100 Rupees Coin విడుదల చేసిన రాష్ట్రపతి: నందమూరి ఫ్యామిలీ హాజరు.. ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకుని.. సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ హీరో నందమూరి తారక రామారావు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం ప్రత్యేకతను చాటుకున్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ వ్యవహరించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ 100వ జయంతిని పూర్తి చేసుకున్నారు. దీన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట రూ. 100 నాణెం విడుదల చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
శత పురుషుడు ఎన్టీఆర్:నందమూరి తారక రామారావు మే 28వ తేదీకి 100వ జయంతిని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచే నందమూరి అభిమానులు ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. దీని పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం జరుపుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మొత్తం చాలా ఈవెంట్లను నిర్వహించిన విషయం తెలిసిందే.

100 నాణెంతో గౌరవం:విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట రూ. 100 నాణెం విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి నాణెం తయారు చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రెసిడెంట్ చేతులతో:ముందుగా ప్రకటించినట్లుగానే ఎన్టీఆర్ 100 రూపాయల నాణెన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నాణెన్ని విడుదల చేసిన తర్వాత సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఎన్టీఆర్ చేసిన సేవల్ని రాష్ట్రపతి స్మరించుకున్నారు. అలాగే, ఎన్టీఆర్ గొప్పదనాన్ని వివరించారు.

వాళ్లందరూ వచ్చారు:ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఆయన పిల్లలు నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి స్టేజ్పై రాష్ట్రపతితో కలిసి ఆశీనులు అయ్యారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, నాయకులు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.

ఎన్టీఆర్కూ ఆహ్వానం:ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీకి చెందిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఇందులో హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్కు సైతం ఇన్విటేషన్ వచ్చినట్లు తెలిసింది. దీంతో వీళ్లు కూడా ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ రిలీజ్ ఈవెంట్కు హాజరు కాబోతున్నారని అంతా అనుకున్నారు.

అందుకే రాలేదంట:నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల నాణెం విడుదల చేసే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే దీనిపై ఎన్నో రకాల ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. తారక్ 'దేవర' సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే హాజరు కాలేదని తెలిసింది.


Click it and Unblock the Notifications











