జ్వరమొచ్చినా సినీ ప్రమోషన్ లో హీరోయిన్
ముంబై : ప్రియాంక చోప్రా ప్రస్తుతం జ్వరమొచ్చినా వైద్యం చేయించుకొని మరీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం హాట్ టాపిక్ గా మారింది. 'క్రిష్ 3' ప్రచారంలో భాగంగా హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ప్రియాంక జ్వరంతో బాధపడింది. హృతిక్ ఎంత వద్దని వారించినా ప్రియాంక వినకుండా తన వల్ల ప్రచారం ఆగిపోకూడదని వైద్యం చేయించుకొని మరీ కార్యక్రమాల్లో పాల్గొందని తెలుస్తోంది. దాంతో బాలీవుడ్ ఆమె డెడికేషన్ గురించి చెప్పుకుంటోంది.
ఇక ప్రియాంక చోప్రా క్యాన్సర్పై పోరాటం ప్రకటించింది. తన తండ్రి అశోక్చోప్రా క్యాన్సర్ సోకి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం ముంబైలోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ వార్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు విరాళం అందించింది. 'క్యాన్సర్పై జరిగే పోరాటానికి నేను మద్దతు ప్రకటిస్తున్నా.
రోగులకే కాదు, వారి కుటుంబాలకు కూడా దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టసాధ్యమైన విషయం' అంటోంది ప్రియాంక. క్యాన్సర్ చికిత్స ప్రతి ఒక్కరికీ అందాలనేదే తన ధ్యేయమంటోంది. తన తండ్రికి క్యాన్సర్ సోకగానే తమ కుటుంబం ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో చెబుతూ.. 'ఆయన ఎనిమిదేళ్ల పాటు బతికారు. మా అమ్మ డాక్టర్ కావడం ఇందుకు ఒక కారణం. క్యాన్సర్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది'అని తెలిపింది ప్రియాంక చోప్రా.
ఇక సదరు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కూడా ప్రియాంక చోప్రా హాజరు కాబోతున్నారు. ప్రియాంక చోప్రాను ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో ఫిజీషియన్గా సేవలు అందించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ సంవత్సరం జూన్ నెలలో మరణించారు.


Click it and Unblock the Notifications












