హీరోయిన్ ప్రియాంక చోప్రా కుటుంబంలో విషాదం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక చోప్రా అమ్మమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఐదారు రోజుల క్రితమే ప్రియాంక చోప్రా తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకూంటూ చిన్నతనంలో ఆమెతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ప్రియాంక చోప్రా పోస్టు చేసిన ఫోటో చాలా బావుందంటూ సోషల్ మీడియాలో వేలాది లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అయితే ఇంతలోనే ప్రియాంక చోప్రా అమ్మమ్మ మరణించిన వార్త విని ఆమె అభిమానులు షాకయ్యారు.

చిన్నతనం నుండి ప్రియాంక చోప్రాకు అమ్మమ్మతో మంచి అనుబంధం ఉంది. ఇటీవల ప్రియాంక రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో కూడా అమ్మమ్మ ఆమె పక్కనే ఉన్నారు. ప్రియాంక ఎంత బిజీగా ఉన్న షూటింగు గ్యాపుల్లో అమ్మమ్మను కలిసి వస్తుండేది.

ప్రస్తుతం షూటింగులో బిజీగా ఉన్న ప్రియాంక అమ్మమ్మ మరణ వార్త విని వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రియాంక చోప్రాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆమె స్నిహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపుతున్నారు.


Click it and Unblock the Notifications











