ఖబర్దార్.. తండేల్ పైరసీని గుర్తించాం.. త్వరలో అరెస్ట్.. అల్లు అరవింద్ వార్నింగ్
పైరసీ.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పదం... నిర్మాతలు ఎంత పకడ్బందీగా సినిమాను రిలీజ్ చేస్తున్నా కొందరు అక్రమార్కులు మార్కెట్ ఉన్న సినిమాలను పైరసీ చేస్తున్నారు. నిర్మాతలకు రావాల్సిన వసూళ్లను అక్రమ మార్గంలో కొల్లగొడుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పైరసీ పెద్ద సమస్యగా మారింది. మరోవైపు అంతే సులువుగా వారిని గుర్తించేందుకు ఫిల్మిం ఛాంబర్ టెక్నీషియన్లూ పనిచేస్తున్నారు. ఇప్పటికే ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సెల్ ద్వారా పలువురిని గుర్తించినట్టు టీమ్ చెబుతోంది.
ఈ విషయమై అల్లు అరవింద్ మాట్లాడుతూ.. దిల్ రాజ్ 'గేమ్ చేంజర్' నుంచి పైరసీ బెడద ప్రారంభమైంది. ఇప్పుడు తండేల్ పైరసీ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ లో కొంత డబ్బు వెచ్చించి మరీ సినిమాల పైరసీని అడ్డుకునేందుకు సెల్ కూడా ఏర్పాటు చేశాం. కంటిన్యూస్ పైరసీ చేసే వారిపై నిఘా ఉంటుంది. ఎలాంటి సినిమాకు నష్టం జరగకుండా చూస్తున్నాం. ముఖ్యంగా మంచి ప్రింట్ పైరసీ కావడం బాధాకారం. వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ లలో ఎక్కువగా స్పెడ్ అవుతోంది.

ఇప్పటికే సైబర్ సెల్ వారికి తెలియజేశాం. రెండ్ సెల్ లు పైరసీపైనే నిఘా పెట్టాయి. గట్టిగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయా సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ లో ఖాతాలు, గ్రూప్ ల్లో ఉన్న అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కొందరు అడ్మిన్స్ ను గుర్తించాం. వారు జైలుకు వెళ్లడం ఖాయం. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. కుర్రాళ్లు సరదాకి పోయి క్రైమ్ ను చేయొద్దు. సినిమాను పైరసీ చేయడం నేరమని గుర్తుపెట్టుకోండి. మరోవైపు ఆర్టీసీ బస్సులోనే పైరసీని ప్రదర్శించడం బాధాకరం. వీటన్నింటిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.
ఇక తండేల్ చిత్రాన్ని పెద్ద బ్లాక్ బాస్టర్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరిస్తున్న తరుణంలో ఇలాంటి పైరసీ భూతం నిర్మాతలకు షాక్ ఇచ్చింది. గతంలో 'గేమ్ ఛేంజర్' సినిమాను కూడా ఇలాగే పైరసీ చేయడం బాధాకరం. ఎన్నో కోట్లు పెట్టి ఫ్యాన్స్, సినీ ప్రియులు థియేటర్లలో ఎంజాయ్ చేయాల్సిన సినిమా నేరుగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రత్యక్షమవడంతో దర్శకనిర్మాతలు, సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. వెంటనే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన 'తండేల్' చిత్రం థియేటర్లలో దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమానే హిట్ టాక్ సంపాదించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడురోజుల్లో ఈ చిత్రం రూ.75 కోట్ల వకు రాబట్టింది. రూ.100 కోట్ల సినిమాగా నాగచైతన్య కెరీర్ లో రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఇక ఈ మూవీని చందూమొండేటి డైరెక్ట్ చేయగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించి అలరించింది. దేవీశ్రీ ప్రసాద్ మరోసారి సెన్సేషనల్ ఆల్బమ్ అందించారు.


Click it and Unblock the Notifications











