ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నా.. ఆయన్ని చూడడమే అదృష్టం అనుకుంటే!
దిగ్గజ దర్శకుడు చాలా గ్యాప్ తరువాత పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం తెరక్కించిన భారీ చిత్రం నవాబ్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్ కు అశోక్ వల్లభనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నిక్కర్ నుంచి ప్యాంటులోకి
తాను నిక్కర్ నుంచి ప్యాంటులోకి మారుతున్న వయసులో మణిరత్నం నాయకుడు చిత్రం విడుదలయింది. ఆ చిత్రాన్ని 30 సార్లు చూశానని అశోక్ వల్లభనేని అన్నారు. మణిరత్నం చిత్రాలు ఆ వయసులో విపరీతమైన ప్రభావం చూపాయని తెలిపారు.

చూడడమే అదృష్టం అనుకుంటే
దిగ్గజ దర్శకుడు మణిరత్నం గారిని చూడడమే అదృష్టంగా భావించేవాడిని. అలాంటిది ఆయన చిత్రానికి నిర్మాతగా మారానని అశోక్ అన్నారు. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఏ ఆర్ రెహమాన్ తో నేరుగా సినిమా చేయలేకపోయినా పరోక్షంగా ఆయన సంగీతం అందించిన చిత్రానికి నిర్మతనయ్యే అదృష్టం దక్కిందని అశోక్ తెలిపారు.

స్మగ్లర్ అవుదామనుకున్నా
మణిరత్నం నాయకుడు చిత్రం చూడగానే స్మగ్లర్ అయిపోదామని కోరిక కలిగింది. దొంగా దొంగా చిత్రం చూడగానే దొంగగా మారపోదామని అనిపించిందంటూ అశోక్ సరదా వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర, తెలంగాణ మొత్తం
తన అభిమాన నటుడు అరవింద స్వామి కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. రోజా, బొంబాయి వంటి చిత్రాలు చూస్తూ పెరిగానని తెలిపారు. మణిరత్నం కథపై నమ్మకం, ఆయన ఇచ్చిన ధైర్యంతో నవాబ్ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ మొత్తం సొంతంగానే విడుదల చేస్తున్నట్లు అశోక్ వల్లభనేని తెలిపారు.


Click it and Unblock the Notifications











