రాజమౌళి సినిమా కథ అది కాదు.. క్లారిటీ ఇచ్చిన దానయ్య.. రూమర్లకు చెక్!
బాహుబలి ఘన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్గా ఆర్ఆర్ఆర్ అని వ్యవహారిస్తున్నారు. అయితే ఈ చిత్ర కథ, బడ్జెట్, నటీనటులపై అనేక కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ స్టోరీపై క్లారిటీ ఇచ్చారు.

కథపై అనేక రూమర్లు
రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రం పునర్జన్మ కథతో తెరకెక్కనున్నదనే వార్తలు వినిపించాయి. అలాగే హిందీలో ఘనవిజయం సాధించిన షారుక్, సల్మాన్ ఖాన్ చిత్రం కరణ్ అర్జున్ను రీమేక్ చేస్తున్నారనే మరో మాట మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే వాటిపై రాజమౌళి ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

మరో నెలలో పూర్తి క్లారిటీ
ఇలా ఒక్కోరకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తలో వాస్తవం లేదు. ఆ సినిమా కథ గురించి ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. మరో నెలలో కథ, ఇతర విషయాల గురించి పూర్తి క్లారిటీ వస్తుంది అని అన్నారు.

2020 వేసవిలో రిలీజ్
రాజమౌళితో రూపొందించే సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. 2020 వేసవిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చరణ్, ఎన్టీఆర్ తప్ప మిగితా పాత్రలకు ఎవరినీ ఎంపిక చేయలేదు అని డీవీవీ దానయ్య వెల్లడించారు. ఇటీవల భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఆయన నిర్మించిన సంగతి తెలిసిందే.

మల్టీస్టారర్ బడ్జెట్ 300 కోట్లు
రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చే చిత్రం బడ్జెట్ మాత్రం రూ.300 కోట్లు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కథపై విజయేంద్ర ప్రసాద్ కసర్తతు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా వివరాలను వెల్లడిస్తామని డీవీవీ దానయ్య చెప్పారు.


Click it and Unblock the Notifications











