మంత్రి శ్రీనివాస్ గౌడ్పై మండిపడ్డ నిర్మాత నట్టికుమార్.. నీకు ఆ విషయాలు తెలుసా? అంటూ ఫైర్
తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా RRR సినిమా యూనిట్ను తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాలకు సంబంధించిన వారు సన్మానించిన కార్యక్రమం వివాదంగా మారింది. ఈ వేడుకను నిర్వహించిన తీరుపై, ఈ వేడుకలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన తీరుపై నిర్మాత నట్టికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్కు కొన్ని ప్రశ్నలు సంధించారు. నట్టి కుమార్ మాట్లాడిన విషయాలు ఏమిటంటే?
చిన్న సినిమా చచ్చిపోయిందంటూ: మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత.. రాక ముందు అంటూ చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో దిల్ రాజు, సునీల్ నారంగ్ లాంటి ఒక్కరిద్దరినే ఆదరిస్తున్నారు. తెలంగాణలో వారికి మెజారిటీ థియేటర్లు ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? తెలంగాణలో చిన్న సినిమా చచ్చిపోయింది. చిన్న సినిమా వస్తే నిర్మాత నష్టాల పాలు కావాల్సిందే అని నట్టి కుమార్ తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత: తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమకు సహకరిస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షూటింగ్ లొకేషన్ల రేట్లు 30 రెట్లు పెంచారు. రోడ్లపై షూటింగ్ చేసుకొంటే.. 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. పెద్ద సినిమాలకే మీ ప్రోత్సాహం.. చిన్న సినిమాలకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. చిన్న సినిమాకు 5వ షో ఇవ్వమని అడిగాం ఇచ్చారా?. ఆ విషయం మీకు తెలుసా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ను నట్టికుమార్ ప్రశ్నించారు.
ఏపీ నుంచే ఎక్కువ రెవెన్యూ అంటూ: నైజాం ఏరియాలో ఎక్కువ లాభాలు వస్తాయని ఇక్కడి షేర్ హీరోలు, నిర్మాతలు పెట్టుకొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. సినిమా పరిశ్రమలో ఏపీలో 68 శాతం రెవెన్యూ వస్తున్నది. ఆ జీఎస్టీ కూడా తెలంగాణలో కడుతున్నారు. ఇలాంటి విషయాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలుసు లేదో. కానీ ఆ విషయాలు తెలుసుకోవాలి అని నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు.

తెలంగాణను కించపరచలేదు అంటూ: తెలంగాణ యాస, భాష గురించి మంత్రి చేసిన కామెంట్స్ను కూడా నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. మేము ఎప్పుడు కూడా సినిమాల విషయంలో తెలంగాణను కించపరచలేదు. అది ఎప్పుడూ జరగలేదు. కొన్ని సందర్భాల్లో కథ డిమాండ్ చేయడంతో అలా రాసి ఉంటారు. నాటు నాటు పాట తెలంగాణకు సంబంధం ఉండటం వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందనడం సరికాదు. గతంలో కూడా తెలంగాణ నేపథ్యంగా ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క, సారక్క సినిమాలు చేశాం అని నట్టి కమార్ తెలిపారు.

ఆస్కార్ వస్తే ఫంక్షన్ ఇలా చేస్తారా? అంటూ: తెలుగు సినిమాకు ఆస్కార్ రావడమంటే చాలా గొప్ప విషయం. అలాంటి సందర్బాన్ని గొప్ప వేడుకగా చేయాల్సింది. కానీ సినిమా పరిశ్రమలోనే ఎవరికి తెలియకుండా వేడుకను చిన్నగా చేశారు. ఈ వేడుక కోసం 25 లక్షలు వసూలు చేశారు. ఆ డబ్బును ఈ వేడుకకు వాడటం నేను ఒప్పుకొను. నిర్మాతల మండలి చెల్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాను అని నట్టి కుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications











