Waltair Veerayya: ఇండియాలో రవితేజ ఒక్కడే.. ఆ సెంటిమెంట్తో మూవీ హిట్టే.. నిర్మాతలు ఆసక్తికర స్పీచ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. అలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో టాలీవుడ్లోని హీరోలంతా ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మహారాజా రవితేజతో కలిసి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను చేస్తున్నారు. అతి త్వరలోనే రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్మాత నవీన్ యెర్నేనీ, సీఈవో చెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతులు మీకోసం!

వాల్తేరు వీరయ్యగా చిరు ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్కు రెడీ అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకకు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు.

రవిశంకర్ మిస్.. నవీన్ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం రవి శంకర్ మిస్ అయ్యారు. ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉండడం వల్లే రాలేదని నవీన్ క్లారిటీ ఇచ్చారు.

మా కల నెరవేరింది అంటూ
'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత నవీన్ యెర్నీని మాట్లాడుతూ.. 'ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే చిరంజీవి గారితో సినిమా చేయడం అనేది మా కల. అది ఈరోజు నెరవేరింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్. అలాగే, మా బ్యానర్లో ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్ బాబీ గారికి స్పెషల్ థ్యాంక్స్' అని చెప్పారు.

ఇండియాలో రవితేజ ఒక్కడే
ఆ తర్వాత నవీన్ యెర్నేని కంటిన్యూ చేస్తూ.. 'మేము, బాబీ గారు చాలా సార్లు అనుకున్నాం. ఈ సినిమాలో ఆ రోల్ను ఇండియాలో రవితేజ గారు తప్ప ఎవరూ చేయలేరని. మా సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండీ. అలాగే, ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు. మీ వల్లే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ గారు మీరు మాకు ఎన్నోసార్లు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే చేశారు. బ్యాగ్రౌండ్ ఇరగదీశారు. ఈ సినిమాను అందరూ 13న థియేటర్లలో చూడండి' అంటూ చెప్పుకొచ్చారు.

చిరంజీవి అందుకే పెద్ద అని
అనంతరం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు చిరంజీవి, రవితేజతో పాటు ఎంతో మంది ప్రముఖులతో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిరంజీవి గారూ.. మీరు ఈ ఇండస్ట్రీలో పెద్దగా ఎందుకు ఉన్నారో మీతో కలిసి పని చేయడం వల్ల తెలిసింది. ఈ ఇమేజ్ను ఎవరూ చేరుకోలేరు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్' అన్నారు.

ఆ సెంటిమెంట్ వల్ల హిట్టే
తర్వాత చెర్రీ మాట్లాడుతూ.. 'రవితేజ గారితో విక్రమార్కుడుకు పని చేశా. ఆయన ఎనర్జీ అదుర్స్. సెట్స్కు వస్తే చాలు పక్కన వాళ్లకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక, బాబీ గారు తనకు ఏమి కావాలో కచ్చితంగా తెలిసిన వ్యక్తి. ఆల్రేడీ మీరు హై రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు మరింత ఉన్నత స్థాయికి వెళ్లారు. అలాగే, దేవీ గారు మీరు మాకు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. మైత్రి బ్యానర్లో వీరు చేసిన సినిమాలు అన్నీ హిట్లే. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే. ఇక, ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్' అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











