Acharya Pre Release Event: రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. అసలు విషయం బయట పెట్టిన నిర్మాత
హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా రాజమౌళి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా మరికొందరు టాలీవుడ్ దర్శకులు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మునుపెన్నడూ లేనివిధంగా రామ్ చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటి సారి ఇలా పూర్తిస్థాయి సినిమా చేయడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమెకు ధన్యవాదాలు
ఆయన రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారని కాబట్టి తాను ఏమి మాట్లాడినా టీమ్ అందరి తరపున మాట్లాడినట్లు అని చెప్పుకొచ్చారు. ముందుగా టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరునా పలకరించిన ఆయన సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారని సినిమా ఇంత అద్భుతంగా రావడానికి వారే కారణమని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా సరే అడగగానే కాదనకుండా వచ్చి చేసిందని ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా
ఇక దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ ఉండడంతో తెలుగు సినిమాలు ఎందుకు ఆ స్థాయిలో ఆడ లేక పోతున్నాయని బాధగా ఉండేది అని ముందు నుంచి హిందీ పరిశ్రమ మీద అంత దృష్టి లేదు కానీ సౌత్ నుంచి తెలుగు టాప్ గా ఉండాలని తనకు ఒక చిన్న కోరిక ఉండేదని దాన్ని రాజమౌళి తీర్చారు అని చెప్పుకొచ్చారు నిరంజన్ రెడ్డి. ఈ రోజు మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారని ఇలా తెలుగు సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు చేస్తున్న మీకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు.

నేను ఒప్పిస్తానని
ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఎప్పుడో తనకు ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేశాడని సినిమా చేయడమే కాక తానే స్వయంగా రామ్ చరణ్ ని ఒప్పించి తద్వారా చిరంజీవి సినిమా చేసేలా చేశారు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా తనకు కొరటాల శివ మంచి స్నేహితుడిగా పరిచయం అయితే ఒక తమ్ముడు లాగా రామ్ చరణ్ దొరికాడని తాను ఎలాంటి వాడినా అని కూడా తెలియకుండా నిరంజన్ రెడ్డితో సినిమా అంటే ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావడమే కాక నేను ముందు నాన్నగారిని కూడా నేను ఒప్పిస్తానని చెప్పాడని అలా మా సినిమా రూపు దిద్దుకుంది అని చెప్పుకొచ్చారు.

పెద్దగా ఉండేది కాదని
మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ 1991వ సంవత్సరంలో తమ సొంత ఊరు నిర్మల్ లో ఒక థియేటర్ ఓపెనింగ్ కోసం చిరంజీవి గారు వచ్చారని ఒక నాలుగు లక్షల మంది జనాభా ఆయనను చూడడం కోసం వస్తే ఎప్పటికైనా చిరంజీవి గారిని కలిసి మాట్లాడాలని అనుకున్నాను అని అన్నారు. అలాంటి వ్యక్తితో సినిమా చేయగలను అని జీవితంలో అనుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు ఒక అండగా నిలబడ్డారని నిర్మాత ప్రసాద్ అన్నారని దానికి తగ్గట్టుగానే తాను మరో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను అని చెబుతూనే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో సినిమా మార్కెట్ పెద్దగా ఉండేది కాదని ఆంధ్ర తో పోలిస్తే 20 శాతం మాత్రమే మార్కెట్ ఉండేదని అన్నారు.

రెమ్యునరేషన్ తీసుకోకుండా
అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి మొదటి కోటి రూపాయల షేర్ సాధించిన సినిమా నుంచి ఐదు కోట్ల షేర్ సాధించిన సినిమా వరకు దాని మార్కెట్ ను తీసుకువెళ్లారని, ఆయన వల్ల మేము చాలా లాభపడ్డారని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రెండు దియేటర్ల ఓనర్గా తెలంగాణ ప్రాంతంలో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తిగా చెబుతున్నానని చిరంజీవి వల్ల తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఎంతోమంది బాగుపడ్డారు అని చెప్పుకొచ్చారు. ఇది చాలా మంది చిరంజీవి, రామ్ చరణ్ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని అనుకుంటున్నారని కానీ ముందు సినిమా చేద్దాం సినిమా చేసిన తర్వాత వచ్చిన లాభాలను బట్టి ఆలోచిద్దామని కొరటాల శివ, రామ్ చరణ్, చిరంజీవి ముగ్గురూ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా కోసం పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











