తిరుమలలో వ్యాపారమా? ఆ ప్రదేశమే దొరికిందా? నిర్మాత సురేష్ బాబుపై ట్రోలింగ్
మూడేళ్ల కిందట చైనాలో పుట్టిన కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిన సంగతి తెలిసిందే. కంపెనీలు, ఫ్యాక్టరీలు మూసివేయడంతో ఉత్పాదకత పడిపోయింది. ఇక కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రంగం సినీ పరిశ్రమ. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఎన్నో ఆంక్షలు, నిబంధనలు అమలయ్యాయి. కానీ జనం మాత్రం థియేటర్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు.
కరోనా సమయంలో ప్రజలకు ఓటీటీ మాధ్యమం అందుబాటులోకి రావడం కూడా సినీ పరిశ్రమను దెబ్బకొట్టింది. సామాన్యుడు కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే రూ.2 నుంచి రూ.3 వేలు సమర్పించుకోవాల్సిందే.. అదే ఓ వెయ్యి పెట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏడాది మొత్తం ఇంట్లోనే సినిమా చూడొచ్చు అనే అభిప్రాయానికి మధ్యతరగతి ప్రజలు చేరుకున్నారు. ఓటీటీ మార్కెట్ రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటూ పోవడంతో చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంది. అయితే ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ ధరలు తగ్గించడంతో టాలీవుడ్కు షాక్ తగిలినట్లయ్యింది. అంతేకాకుండా పెద్ద సినిమాల బెనిఫిట్ షోలు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిని సైతం జగన్ సర్కార్ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు అత్యంత అనుకూలంగా ఉండే ప్రభుత్వం రావడంతో టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో మళ్లీ మంచిరోజులు వచ్చినట్లేనని సినీ జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రీసెంట్గా టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీకి తెలుగు నాట మంచి వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుపై ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని, నిర్మాతలకు అనుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ జీవో చేస్తామని అన్నారని సురేష్ చెప్పారు. అయితే టికెట్ రేట్స్ పెంచడం కన్నా .. సినిమాను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని .. ఎక్కువ మంది వచ్చి సినిమాను చూడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కాకుండా .. మాట్లాడిన ప్లేస్ కారణంగా సురేష్ బాబుపై ట్రోలింగ్ జరుగుతోంది.

బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సురేష్ బాబుకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం ఆలయ గాలి గోపురం వద్ద సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గుడి ఆవరణలోకి విలేకరుల మైకులని , మీడియా కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దేవదేవుడి దర్శనానికి వచ్చిన సురేష్ బాబు.. సినిమాలు, వ్యాపారాల గురించి మాట్లాడటానికి ఆ ప్రదేశమే దొరికిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్ర తిరుమల గిరులు కొన్నేళ్లుగా రాజకీయాలకు, ఇతర ఘటనలకు వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తిరుమల క్షేత్ర నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుమల గిరులలో అన్యమత ప్రచార ఘటనలు ఎక్కువయ్యాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వెనుక ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు సిలువ గుర్తులు కనిపించడం కలకలం రేపింది. అలాగే ఇతర మతాలకు చెందిన స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఘాట్ రోడ్లోకి ప్రవేశించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీటిని పక్కనబెడితే.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రముఖులు వచ్చామా , వెళ్లామా అన్నట్లు కాకుండా ఆలయం పక్కనే నిలబడి రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వంటి వారైతే.. తిరుమలలోవిమర్శలు చేసేవారిని తిరుపతిలోనే అడ్డుకుంటామని హెచ్చరించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారికి అపరాధ రుసుము విధించాలని, ఆ సొమ్మును స్వామి వారి హుండీల్లో వేయాలని కూడా భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు వ్యవహారం దుమారం రేపుతోంది.


Click it and Unblock the Notifications











