గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బూతులు అందుకే.. నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్
కాలంలో వచ్చిన మార్పో లేక ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారని తీస్తున్నారో గానీ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ , బూతులు, వల్గారిటీ ఎక్కువవుతోంది. విమర్శకులు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నా మేకర్స్ మాత్రం ఆ టైప్ సినిమాలు తీయడంలో అస్సలు రాజీ పడటం లేదు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. మేం తీస్తున్నాం, ఇందులో మా తప్పేముందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా విశ్వక్సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో బూతులు ఎక్కువయ్యాయంటూ పలువురు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మే 31న విడుదల కానుంది. గోదావరి జిల్లాల్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో బూతులు మోత మోగింది. హీరో క్యారెక్టర్ వేసిన విశ్వక్ సేన్ ట్రైలర్ ఆసాంతం బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. వీటికి కుర్రకారు నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటే పెద్దలు మాత్రం పెదవి విరుస్తున్నారు.
తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం బూతులపై స్పందించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బూతులు ఎక్కువయ్యాయా..? ఆ మాత్రం ఉంటే పర్లేదు కదా అని వంశీ ఎదురు ప్రశ్నించారు. రెండు గంటల పాటు సినిమా మొత్తం ఇంతే మాస్ కంటిన్యూ అవుతుందని ఆయన తెలిపారు. అయితే నాగవంశీపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బు కోసం ఇలా జనాల్లోకి బూతులు వదలటమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ సినిమాలో మరో కీలకపాత్ర పోషించిన అంజలి కూడా బూతులు వల్ల ఇబ్బంది పడినట్లుగా చెప్పింది. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తాను రత్నమాల పాత్ర పోషించానని , గతంలో చేసిన రోల్స్కు భిన్నంగా ఉంటుందని అంజలి తెలిపింది. ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే మొదటిసారని, రియల్ లైఫ్లో కూడా బూతులు వాడనని, అలాంటి ఆ క్యారెక్టర్ కోసం దర్శకుడు తనను సంప్రదించడం ఆశ్చర్యం కలిగించిందని అంజలి చెప్పింది.
ఇకపోతే.. రత్నాకర్ అనే రాజకీయ నాయకుడి క్యారెక్టర్లో విశ్వక్సేన్ నటించారు. టీజర్, ట్రైలర్లో చూపించింది కొంతేనని, సినిమాలో చాలా ఉందని.. ఈ మధ్య సినిమా హాళ్లు మూసేశారని.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మళ్లీ థియేటర్లు కళకళలాడతాయని విశ్వక్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూత్కి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో పాటు రేపటితో ఐపీఎల్ ముగియనుండటంతో కుర్రకారు థియేటర్లకు పోటెత్తుతారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో థియేటర్లు కళకళలాడితే అంతకుమించి కావాల్సింది ఏముంది.


Click it and Unblock the Notifications











