వివాదం: పలు చోట్ల సినిమా ప్రదర్శన ఆపేసారు
హైదరాబాద్: డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదలైంది. ఈ సినిమాపై గత కొంత కాలంగా సెన్సార్ వివాదం నడుస్తోంది. ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా విడుదలైన వెంటనే ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఢిల్లీలోని దాదాపు ఐదు థియేటర్ల వద్ద ఆందోళనలు కొనసాగడంతో సినిమా ప్రదర్శన నిలిపి వేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
డేరా సచ్ఛా సౌధ అధ్యక్షుడు రామ్రహీమ్ సింగ్ నటించి, సంగీతాన్ని సమకూర్చి, దర్శకత్వం కూడా చేసిన చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్'. పలు అవాంతరాలను దాటుకుని ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసారు. కానీ ఈ చిత్రం సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమాలో రామ్ రహీమ్సింగ్ వేషధారణ 17వ శతాబ్దానికి చెందిన సిక్కుగురువును తలపించేలా ఉందని సిక్కులు భావిస్తున్నారు. బంగారు ఆభరణాలను ధరించిన గురువు బైకులను నడపడం వంటి వాటికి సర్వత్రా అభ్యంతరం వ్యక్తమైంది. ఇతరులు తప్పు పట్టడానికి సినిమాలో ఏమీ లేదనీ, డ్రగ్ అడిక్షన్ను, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూనే ఈ సినిమా చేశామని రూపకర్తలు చెబుతున్నారు.
రామ్ రహీమ్ సింగ్ ఆ మద్య సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఇందులో ఎవరూ వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఈ చిత్రంలో నన్ను నేను దేవుడిగా ఎక్కడా ప్రదర్శించుకోలేదు. కనీసం ‘నేను దేవుడిని' అనే మాటను కూడా వాడలేదు. సినిమాను వ్యతిరేకించేవారు ముందు సినిమాను చూడండి. తర్వాత మాట్లాడండి'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











