60 కోట్ల స్కాంలో తమన్నా, కాజల్ పేర్లు.. హీరోయిన్లను విచారించనున్న సైబర్ క్రైమ్
ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. డిస్కౌంట్లు, ఆఫర్లకు తోడు టీవీలు, రేడియోలు, ఆన్లైన్లో రకరకాల ప్రకటనలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు ఇతర సెలబ్రెటీలతో బ్రాండ్ అండార్స్మెంట్స్ చేయించి బిజినెస్ పెంచుకోవాలని చూస్తుంటాయి. మనదేశంలో చాలా మంది సెలబ్రెటీలు ఎన్నో కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
రోజుల తరబడి సినిమాలు చేసినా రానంత డబ్బు .. కేవలం 30 సెకండ్ల యాడ్లో కనిపించడం వల్ల వస్తుండటంతో పలువురు స్టార్స్ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఎగబడుతున్నారు. స్టార్స్ ఓకే చెప్పాలే కానీ కోట్లకు కోట్లు పారితోషికం కింద కుమ్మరించేందుకు కంపెనీలు రెడీగా ఉంటున్నాయి. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటించి కష్టాలు తెచ్చుకునేవారు లేకపోలేదు. మద్యం, పాన్ , గుట్కా, బెట్టింగ్ యాప్స్, చీట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ప్రకటనల్లో నటించి చిక్కుల్లో పడ్డ నటీనటులు ఎందరో.

కొద్దిరోజుల క్రితం దేశాన్ని కుదిపేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సెలబ్రెటీలు ఈడీ కేసులను ఎదుర్కొన్నారు. తాజాగా తెలుగునాట బయటపడిన సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ స్కాంలోనూ పలువురు స్టార్స్ పేర్లు బయటికి వచ్చాయి. బై బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్ల మేర తమకు సువర్ణభూమి యాజమాన్యం కుచ్చుటోపీ పెట్టిందంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హీరోలు, ఇతర సెలబ్రెటీలతో సంస్థ పేరును ప్రమోట్ చేయడం వల్ల అది నిజమేనని నమ్మి మోసపోయామని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజాగా తమిళనాడు, పుదుచ్చేరిలలో క్రిప్టోకరెన్సీ స్కామ్ వెలుగుచూసింది. క్రిప్టోలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందొచ్చనే ఆశచూపి పలువురు వద్ద నుంచి కోట్లలో వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. క్రిప్టో ద్వారా అధిక లాభాలు ఇస్తానని తన వద్ద రూ.3.5 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని పుదుచ్చేరికి చెందిన ఓ రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితీష్ జైన్, అరవింద్ కుమార్లను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగుచూశాయి.
నిందితులు ఒక్క పుదుచ్చేరిలోనే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో మోసానికి పాల్పడినట్లుగా తేల్చారు. అయితే ఈ స్కాంకు సంబంధించి స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాల పేర్లు తెరపైకి రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ క్రిప్టో కరెన్సీ కార్యక్రమానికి సంబంధించి 2022లో కోయంబత్తూరు, మహాబలిపురంలలో జరిగిన కార్యక్రమాల్ల కాజల్ , తమన్నాలు పాల్గొన్నారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన పార్టీలో వేలాది మంది నుంచి డబ్బును సేకరించింది ఈ గ్యాంగ్.
ఈ నేపథ్యంలో ఆయా ఈవెంట్లలో పాల్గొన్నందుకు కాజల్ , తమన్నాలకు నగదు ఎవరు చెల్లించారు? కేవలం ప్రమోట్ చేయడానికే వీరిద్దరూ వచ్చారా? లేక వ్యాపార భాగస్వాములా? ముంబైలో జరిగిన పార్టీలో ఇన్వెస్టర్లను రప్పించడానికి కాజల్, తమన్నాలు ఎందుకు ప్రయత్నించారు అనే అనుమానాలు పోలీసుల్లో బలపడ్డాయి. ఈ నేపథ్యంలో కాజల్, తమన్నాలను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీస్ బృందం ముంబైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











