దేవుళ్లని కించపరిచే సన్నివేశాలపై పూరీ జగన్ వివరణ
హైదరాబాద్ :రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు'చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేముళ్లను కించపరిచేలా బ్రహ్మానందం, కోవైసరళలాంటి హాస్యనటుల్ని దేవుళ్లుగా చూపిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై మీడియాకు దర్శకుడు పూరీ జగన్నాధ్ క్లారిఫై చేసారు. ఆయన మట్లాడుతూ..సరదా కోసం చేసిన ప్రయత్నమే. అంతమాత్రాన ఈ సినిమాలో దేవుళ్లని కించపరిచేలా సన్నివేశాలేం ఉండవు. అసలు అలాంటి ఉద్దేశమే లేదు. నేను దేవుణ్ని పూజించను. కానీ మా ఇంట్లో నా భార్య, పిల్లలకు దేవుడంటే నమ్మకం. ఈ సినిమా నిర్మాతకూ భక్తి ఎక్కువే. కోట్లాది మంది ప్రజలు విశ్వసించే భగవంతుడిపై సెటైర్లు వేస్తాననుకోవడం పొరపాటు అన్నారు.
అలాగే దేవుడిపై నాకు నమ్మకం ఉంది.కానీ పూజించను. నాకు అది కావాలి, ఇది కావాలీ అని అడగను. 'బిజినెస్మేన్' సినిమా చూశారుగా. నాది కూడా మహేష్బాబు ఫిలాసఫీనే. 'నువ్వు బాగుంటే చాలు భగవంతుడా..' అనుకొంటాను అన్నారు. అలాగే 'దేవుడు చేసిన మనుషులు' ఒక విధంగా సోషియో ఫాంటసీ సినిమా. ఈ కథలో దేవుళ్లూ ఉంటారు, మనుషులూ ఉంటారు. ఇలాంటి కథని తెరపైకి తీసుకురావడం నాకే చాలా కొత్తగా అనిపిస్తోంది అన్నారు.
ఇక రవితేజతో నాకు అయిదో సినిమా. మా ఇద్దరి మధ్య ఉన్న అవగాహన వల్లే అది సాధ్యమైంది. సహాయ దర్శకులుగా పనిచేస్తున్నప్పటి నుంచీ మా మధ్య మంచి స్నేహం ఉంది. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అమ్మా నాన్న....', 'ఇడియట్' ఈ మూడు కథలూ రవికి ఒకేసారి చెప్పా. ఇదే వరుసలో సినిమాలు తీసేశాం. ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్య కథ గురించి పెద్ద పెద్ద సమాలోచనలేం జరగవు. ఏ కథైనా ఐదు నిమిషాలు వింటాడంతే అన్నారు.
మా కథకి 'దేవుడు చేసిన మనుషులు' పేరైతేనే కచ్చితంగా సరిపోతుంది. ప్రేక్షకులు కూడా త్వరగా కనెక్ట్ అవుతారనిపించింది. ఈ పేరు ఎప్పుడైతే బయటికి వచ్చిందో... విన్నవాళ్లు కాస్త షాక్కి గురయ్యారు. మా ఉద్దేశం కూడా అదే. ఇక కథ లేకుండా సినిమా తీయటం గురించి చెపుతూ...ఈ మధ్య రాంగోపాల్వర్మ నాకో మాట చెప్పారు. 'కథ అనే విషయాన్ని దర్శకులు తీసుకొన్నంత సీరియస్గా ప్రేక్షకులు తీసుకోరు..' అని. ఆ మాట నాకు నిజమే అనిపిస్తోంది. 'అడవిరాముడు' సినిమా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేదేమిటి? ఎన్టీఆర్-జయప్రదల మధ్య 'ఆరేసుకోబోయి పారేసుకొన్నా..' అనే పాటే కదా. 'ఈ అడవికి నేను రాముడిని, నీకు యముణ్ని' అంటూ ఎన్టీఆర్ పలికే సంభాషణలు గుర్తుకొస్తాయి అని చెప్పారు.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











