పూరి జగన్నాథ్ ‘గుహ’లో ఎన్టీఆర్ మూవీ!
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల రూ. 20 కోట్ల ఖర్చుతో జూబ్లీహిల్స్లో భారీ భవంతిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. తన అభిరుచికి తగిన విధంగా పూరి జగన్నాథ్ దీన్ని డిజైన్ చేయించారు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగుతో 7 స్టార్ హోటల్ రేంజిలో దీన్ని నిర్మించారు. ఇంటితో పాటు ఆఫీసు కూడా ఇందులో సెట్ చేసారు. దీన్ని పూరి జగన్నాథ్ కేవ్ (గుహ) అని పిలుస్తున్నారు.

త్వరలో పూరి జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాబోతోంది. తను కొత్తగా కట్టుకున్న ఇంట్లో కూడా సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు చిత్రీకరించాలని పూరి జగన్నాథ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. గతంలో 'కుమ్మెస్తా' , 'రుబాబు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 'నేనో రకం', 'టెంపర్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి ఈ టైటిల్ అయినా ఫైనల్ అవుతుందో? లేదో? త్వరలో తేలనుంది.
ఎన్టీఆర్ నటిస్తున్న 'రభస' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కొడుకుతో గడుపుతున్నాడు. పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈచిత్రంలో కాజల్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











